Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తూ, లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లులూ గ్రూప్ చైర్మన్ యుసుఫ్ అలీ సమక్షంలో ఈ ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు.
ఈ ఒప్పందంలో భాగంగా, విశాఖ నగరంలో లులూ సంస్థ 13.83 ఎకరాల విస్తీర్ణంలో, 13.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో రూ. 1,066 కోట్ల భారీ పెట్టుబడితో ఒక ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్ను నిర్మించనుంది. ఈ మాల్ నిర్మాణం ద్వారా సుమారు 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇది భారతదేశంలో 9వ మాల్ కాగా, ఆంధ్రప్రదేశ్లో లులూ సంస్థ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి మాల్ ఇదే. ఈ ప్రాజెక్టును మూడేళ్లలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మాల్ కేవలం షాపింగ్కే పరిమితం కాకుండా, విశాఖ పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుందని ఆయన అన్నారు.
Read Also: Parakamani Case CI: పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సీఐ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
దీంతో పాటు, రాయలసీమలో ఒక లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు యుసుఫ్ అలీ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో భాగంగా, తమకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300కు పైగా మాల్స్కు అవసరమైన మామిడి, జామ పల్ప్, మసాలా దినుసులు వంటి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా రాష్ట్రంలోని రైతుల నుంచే కొనుగోలు చేస్తామని లులూ సంస్థ హామీ ఇచ్చింది.
వచ్చే జనవరి నుంచే ఏపీ నుంచి ఈ ఎగుమతులు ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది. గత పాలకులు నిలిపివేసిన ఈ ప్రాజెక్టును తిరిగి రాష్ట్రానికి తీసుకురావడం సంతోషంగా ఉందని, గూగుల్, ఆర్సెల్లార్ వంటి సంస్థలు కూడా విశాఖకు రావడం శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.