Srikakulam Train Stops: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటైన శ్రీకాకుళం నుంచి ఉపాధి అవకాశాల కోసం నిత్యం వేల మంది ప్రయాణాలు చేస్తుంటారు. దేశంలో పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు చేసే ప్రయాణాలకు సాధారణంగా రైల్వేను ఎంచుకుంటారు. శ్రీకాకుళం నుంచి ప్రయాణించే పలు రైళ్లకు హాల్ట్ లు పెంచాలని చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లపై రైల్వే శాఖ అనుమతులు ఇచ్చింది. ఇందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషి కూడా తోడైంది.
“శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే డిమాండ్లకు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యం, అనుసంధానం, రోజువారీ ప్రయాణ సౌలభ్యం ఉపయోగపడేలాగా ఇవాళ రైల్వే శాఖ జిల్లాలోని కీలక రైల్వే స్టేషన్ లలో హల్ట్ లు మంజూరు చేసింది” అని రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
మంజూరైన రైళ్ల హాల్ట్ వివరాలు:
• పూరి–అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్ – ఇచ్చాపురం వద్ద
• బెరంపూర్–విశాఖపట్నం ఎక్స్ప్రెస్ – తిలారు వద్ద
• భువనేశ్వర్–న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ – బారువ వద్ద
Also Read: సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్, స్టేషన్ల సమాచారం ఇదిగో
ఈ రైలు హాల్ట్ లు త్వరలోనే అమలులోకి రానున్నాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై తాను ఎంతోకాలంగా కృషి చేస్తున్నానన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే రైల్వే అధికారులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లాకు మెరుగైన రైలు సౌకర్యాలు, అభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు పడిందన్నారు.