Kandula Durgesh: ఏపీ సీఎం చంద్రబాబు వంట మనుషులతో ఫేక్ ఎంవోయూలతో చేసుకున్నారని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం విమర్శించారు. కేసీఆర్ విమర్శలకు మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ప్రతీ ఎంవోయూ గ్రౌండ్ అయ్యిందన్నారు. అంతే కాకుండా ఎంవోయూలపై సీఎం చంద్రబాబు.. ప్రతి 15 రోజులకొకసారి ఆరా తీస్తుంటారన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఎంవోయూలు గ్రౌండ్ అవ్వలేదేమో కానీ, ఏపీలో జరిగిన ప్రతి ఎంవోయూ గ్రౌండ్ అవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫేక్ ఎంవోయూలు చేసుకున్నారేమో, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని కౌంటర్ ఇచ్చారు.
ఏపీలో ప్రతీ ఎంవోయూ గ్రౌండ్ అయ్యేలా ఒక స్పష్టమైన ప్రణాళిక ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు ఎంవోయూలపై చర్చించారన్నారు. ఎంవోయూలను పెట్టుబడులుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
వెలగపూడి సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహితోత్సవంపై పలు అంశాలను వివరించారు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో “ఆవకాయ్ సినిమా సంస్కృతి & సాహిత్యోత్సవం”ను విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సాంస్కృతిక ఉత్సవం ద్వారా తెలుగు కళా వారసత్వానికి ఘనమైన వేదిక కల్పించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
“2026 జనవరి 8,9,10 తేదీలలో విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ లో మూడు రోజుల పాటు ఈ ఫెస్టివల్ జరగనుంది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా ప్రవేశం పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నాము. సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, కవిత్వం, సాంస్కృతిక చర్చలు వంటి విభిన్న కళారూపాలను ఒకే బహిరంగ వేదికపైకి తీసుకురావడమే ఆవకాయ్ ఉత్సవం ఉద్దేశం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మకతకు పెద్దపీట వేసేలా ఈ వేడుక రూపుదిద్దుకుంది”- మంత్రి కందుల దుర్గేష్
“ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దార్శనికతతో, ప్రజా రాజధాని అమరావతిని సాహితీ–కళా రాజధానిగా తీర్చిదిద్దే దిశలో ఈ ఫెస్టివల్ ఒక కీలక తొలి అడుగుగా నిలవనుంది. అమరావతి–విజయవాడ ప్రాంతాన్ని సమకాలీన సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. సాంస్కృతిక రంగాన్ని పర్యాటక రంగానికి బలమైన ఆధారంగా మార్చే దిశగా ఆవకాయ్ ఒక ముఖ్యమైన వేదిక. ఈ ఉత్సవం ద్వారా స్థానిక కళాకారులకు గొప్ప అవకాశాలు కల్పించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ను దేశవ్యాప్తంగా ఒక శక్తివంతమైన సాంస్కృతిక గమ్యస్థానంగా నిలిపే ప్రయత్నం జరుగుతోంది.
Also Read: BRS Loves YSRCP : బీఆర్ఎస్, వైసీపీ ప్రేమ కథ.. పెళ్లా, సహజీవనమా?
మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో సినిమా సాహిత్య చర్చలు, సంగీతం, నాటక ప్రదర్శనలు, వర్క్షాపులు, హెరిటేజ్ వాక్స్, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, స్థానిక రుచులతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ప్రజలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ సాంస్కృతిక సంబరాల్లో భాగస్వాములు కావాలని కోరారు” -మంత్రి కందుల దుర్గేష్