Tirupati Sabha: జెన్ జీ.. కాక్రోచెస్ అంటూ జగన్ చేసిన కామెంట్స్ కౌంటరిచ్చారు మంత్రి లోకేష్. జగన్ ఆయన పేరులో ‘జీ’ని చూసి జెన్ జీ (Gen Z) అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కానీ జగన్ పేరులో జీ అంటే గొడ్డలి అని, అందుకే ఆ పార్టీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టామన్నారు. ఆయనకు సీసీడీ వ్యాధి ఉందని, క్రెడిట్ చోరీ జబ్బు ఉందన్నారు.
జగన్ ‘జెన్ జీ’ వ్యాఖ్యలపై లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
ఏపీలో మిత్తల్ ప్రాజెక్టు వస్తుందని వార్త వచ్చిందని, మరుసటి రోజు మీడియా సమావేశంలో ప్రాజెక్టు రాలేదని పక్క రాష్ట్రానికి వెళ్తుందని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్ట్కు సీఎం, డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తే.. తామే ఆ ప్రాజెక్టు తీసుకొచ్చామని ఆ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేశారని వివరించారు. గూగుల్ మన రాష్ట్రానికి వస్తుంటే రాకుండా అడ్డుపడ్డారని, కోర్టులో కేసులు కూడా వేశారని వివరించారు.
మావల్ల గూగుల్ ప్రాజెక్టు వచ్చిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి సంక్షేమం’ పేరిట తిరుపతిలో నిర్వహిస్తున్న బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు.
రప్పా రప్పా అంటూ చూస్తూ ఊరుకోం.. తిరుపతి కూటమి సభలో లోకేష్
తిరుపతి గడ్డపై సభ జరుగుతుండడంతో చెప్పులు విడిచి ‘ఓం నమో వెంకటేశాయ’ అంటూ స్పీచ్ మొదలుపెట్టారు మంత్రి నారా లోకేష్. సిద్ధం అంటే యుద్ధానికి పిలుపునిచ్చింది మా పసుపు సైన్యమని అన్నారు. ఇప్పుడు రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకోమని, రెడ్ బుక్ పని అది చేసుకుంటూ వెళ్తుందని ఆ బ్యాచ్కు హెచ్చరిక జారీ చేశారు.
రెండేళ్ల పాలనలో సుపరిపాలన అందించామని, అన్నీ చేశామని కాలర్ ఎగురవేయలేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, పద్దతి ప్రకారం వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విరాట్ కోహ్లీ మన చంద్రబాబు ఉన్నారని, అటు వైపు బౌలర్లు మారుతున్నారని తనదైన శైలిలో ప్రస్తావించారు.
ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్
సినిమాలో పవర్ స్టార్…రాజకీయాల్లో జనసేనాని అని, ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసన్నారు. తనకు సొంత అన్న లేని లోటు తీర్చిన నా పవనన్నకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు నమస్కారం అంటూ మాట్లాడారు. టీడీపీ-జనసేన- బీజేపీ అంతా ఒకే కుటుంబమని, అందులో చిన్నచిన్న సమస్యలు రావచ్చన్నారు. అందరం కూర్చొని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు మంత్రి లోకేష్.