Pavala shyamala:తెలుగు వెండితెరపై తన మార్క్ నటనతో, గయ్యాలి పాత్రలతో పదుల సంఖ్యలో సినిమాల్లో నవ్వులు పూయించిన ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల(Pavala Shyamala) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించగా, ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని మోర్చరీలో భద్రపరిచారు. నటి శ్యామల మరణంతో, ఆమె కూతురు పరిస్థితిపై అందరిలో ఆందోళన నెలకొంది. ఆమె గురించి తెలుసుకుందాం..
పల్నాడు జిల్లా అమరావతిలో జన్మించిన శ్యామల, నాటకాల ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ‘పావలా’ అనే నాటకంతో వచ్చిన గుర్తింపుతో నేతి శ్యామల కాస్త ‘పావలా శ్యామల’గా మారిపోయారు. ఇక 1985లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘బాబాయ్ అబ్బాయి’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘స్వర్ణకమలం’, ‘కర్తవ్యం’, ‘ఖడ్గం’, ‘ఇంద్ర’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు.
శ్యామల జీవితంలో చిన్ననాటి నుంచే కష్టాలు మొదలయ్యాయి. 13 ఏళ్లకే ఆమెకు పెళ్లి చేయగా, కూతురు మాధవి పుట్టిన రెండేళ్లకే భర్త ఘోర ప్రమాదంలో కన్నుమూశారు. ఇక కుటుంబ పోషణ కోసం నాటకాలనే నమ్ముకోవడంతో బంధువులంతా ఆమెను వెలివేశారు. ఇక అయినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేసి నటిగా నిలదొక్కుకున్నారు.
చదువుకునే వయసులో శ్యామల కూతురు మేడపై నుంచి కింద పడటంతో తలకు పెద్ద గాయమై జ్ఞాపకశక్తి కోల్పోయింది. ఇక కూతురి ట్రీట్మెంట్ కోసం వైజాగ్లోని ఉన్న ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ఆస్తి మొత్తం ఖర్చు చేశారు. ఇక కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వున్నా ఆమె తన కూతురుకి వైద్యం చేయిస్తూ జీవన పోరాటం సాగించారు.
also read:కిరణ్ అబ్బవరం హిట్స్ వెనుక పీఆర్ టీమ్ బలంగా ఉందా?
శ్యామల మరణంతో, ఆమె కూతురు గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కుమార్తె మాధవి ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక చివరి రోజుల్లో అంతటి దయనీయ స్థితిలో శ్యామల కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్రంగా కలచివేస్తోంది.
ఎన్నో చిత్రాల్లో తన విలక్షణమైన నటనతో ఆడియన్స్ను నవ్వించిన పావలా శ్యామల జీవితం చివరకు తీవ్ర విషాదాంతంగా ముగియడం విచారకరం. ఇక ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, హాస్పిటల్లో ఉన్న ఆమె కుమార్తె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.