Chintoor: చింతూరు ఏజన్సీ విహారయాత్రలో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా గడిపేందుకు వచ్చి, వచ్చి, ఓ చిన్న పొరపాటు ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. అందమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆనందించాల్సిన సమయం, ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఫోటోల సరదా తీసిన ప్రాణాలు
ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన పెండెం కళ్యాణ్ (28), పెండెం బాబి (23) విహారయాత్ర కోసం చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని వ్యూ పాయింట్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న సోకిలేరు వాగు వద్ద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ.. నీటి మధ్యలోని ఒక బండరాయిపై నిలబడి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కళ్యాణ్ ప్రమాదవశాత్తు కాలుజారి ప్రవాహంలో పడిపోయాడు. అతనిని కాపాడేందుకు బాబి వెంటనే నీటిలోకి దిగగా, ప్రవాహ వేగానికి ఇద్దరూ కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
ఘటనా స్థలానికి పోలీసులు..
విషయం తెలుసుకున్న వెంటనే చింతూరు, మోతుగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్ల సాయంతో వాగులో సుదీర్ఘ గాలింపు చర్యలు చేపట్టి, ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఈ హృదయవిదారక సంఘటనతో సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.
ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరికలు
ఈ విషాద ఘటనపై పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకులు విహారయాత్రల్లో ఉత్సాహంతో ప్రమాదకరమైన కొండచరియలు, వాగులు, జలపాతాలు , బండరాళ్లపై సెల్ఫీలు, ఫోటోలు దిగొద్దని గట్టిగా హెచ్చరించారు.
Also Read: అధికారంలోకి రాగానే హైడ్రాని బంగాళాఖాతంలో విసిరేస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!