E-Paper
Advertisement

AP: ఎమ్మెల్సీ ఇంపాక్ట్.. జనసేనతో టీడీపీ కలుస్తుందా? కటీఫ్ చెబుతుందా? జగన్‌కు టెన్షన్!?

AP: ఎమ్మెల్సీ ఇంపాక్ట్.. జనసేనతో టీడీపీ కలుస్తుందా? కటీఫ్ చెబుతుందా? జగన్‌కు టెన్షన్!?
Advertisement

AP: ఓడినోళ్లు ఎప్పుడూ లోకువే. గెలిచినోళ్ల కవ్వింపు మాటలు భరించాల్సిందే. వైసీపీ ఇప్పుడు తీవ్ర అవమాన భారంలో మునిగిపోయింది. కీలకమైన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమిపాలై పరువు పోగొట్టుకుంది. టీడీపీ అక్రమాలకు పాల్పడిందంటూ అధికార పార్టీ విమర్శలు చేస్తున్నా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

అటు, టీడీపీలో ఉత్సాహం రెట్టించింది. “మీ పని అయిపోయింది.. ఇకపై మీ ఆటలు సాగవు.. వచ్చే ఎన్నికల్లో జగన్‌ మళ్లీ గెలిచే పరిస్థితి లేదు.. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండు రోజుల ముందే చెప్పారు”.. అంటూ చంద్రబాబు విజయోత్సాహంలో సవాళ్లు చేస్తున్నారు.

Advertisement

“అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు ఇది కనువిప్పు.. సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి వ్యతిరేక ఫలితమే ఉంటుంది”.. అంటూ జనసేనాని సైతం స్వరం పెంచారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సింగిల్‌గా బరిలో దిగింది. జనసేన పరోక్షంగా మద్దతు ఇచ్చింది. బీజేపీ సైతం పోటీలో నిలిచింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం టీడీపీకే పడింది.

Advertisement

గ్రాడ్యుయేట్ కేటగిరి కాబట్టి.. నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి ఓటు వేశారని.. అదే సాధారణ ఎన్నికలైతే సంక్షేమ పథకాలు పొందుతున్న తమ ఓటుబ్యాంకు తమకు పటిష్టంగానే ఉందని వైసీపీ అంటోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు వేరు వేరుగా పోటీ చేస్తే.. వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభం జరగొచ్చు. కానీ, ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే..? ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్ కావనే గ్యారంటీ అయితే లేదు. అందుకే, జగన్‌లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. “ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారు.. పొత్తుల కోసం వీళ్లంతా ఎందుకు వెంపర్లాడుతున్నారు”.. అంటూ ఆదివారం తిరువూరులో జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమంలో జగన్ ఎమ్మెల్సీ ఓటమి ఉక్రోషాన్ని వెల్లగక్కారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు.. విలన్‌లు కాదని.. చివరికి మంచి చేసిన వాడే గెలుస్తాడు.. అంటూ గెలుపుపై ధీమా కూడా వ్యక్తం చేశారు.

జగన్ మాటల్లో టీడీపీ, జనసేనల పొత్తుపై భయం స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. చంద్రబాబు, పవన్ కలిసి బరిలో దిగితే..? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల చేదు అనుభవమే ఎదురవుతుందా?

దమ్ముంటే అన్నిస్థానాల్లో పోటీ చేయాలంటూ పవన్ కల్యాణ్‌ను పదే పదే కవ్విస్తోంది అధికార పార్టీ. ఆయనేమో మిస్టర్ కూల్‌గా ఉన్నారు. తాము ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తే మీకేంటి? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. మొదట్లో టీడీపీతో పొత్తుపై చాలా ఉత్సాహం కనబరిచిన జనసేనాని.. కొన్నాళ్లుగా కాస్త తగ్గారు. అవసరమైతే, ప్రజలు భరోసా ఇస్తే.. ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

టీడీపీ సైతం జనసేనతో పొత్తు కోసం అంతగా ఏమీ ఆరాటపడటం లేదు. పొత్తు పెట్టుకుంటే.. జనసేనకు చెప్పుకోదగ్గ స్థానాలు కేటాయించాల్సి వస్తుందని టీడీపీ సైడ్ అయిపోతోంది. తక్కువ సీట్లు ఇస్తే ఒప్పుకోమని పవన్ ఇప్పటికే చెప్పేశారు. అలా చూస్తే ఆ రెండు పార్టీల పొత్త కాస్త కష్టమే. అయితే, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో టీడీపీలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. తాము సింగిల్‌గానే గెలుస్తామనే నమ్మకం టీడీపీకి కలుగుతోంది. అదే జరిగితే.. జనసేనతో పొత్తు కష్టమే అంటున్నారు. అది పరోక్షంగా వైసీపీకి లాభం చేయొచ్చు. అందుకే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ భవిష్యత్ రాజకీయాలపై కీలక ప్రభావం చూపించనున్నాయి.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×