Big Stories

TDP: టీడీపీ స్వీప్.. జగన్‌కు బిగ్ షాక్.. మార్పు దేనికి సంకేతం?.. చంద్రబాబు విజయోత్సాహం

TDP: ఎడారిలో జోరు వాన కురిసినంత సంబురం. కరువు భూమిలో పసిడి పంట పండినంత ఆనందం. టీడీపీకి అత్యంత ఊపు ఇచ్చే విజయం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలనూ స్వీప్ చేసి.. విజయ దుందుభి మోగించింది తెలుగుదేశం పార్టీ. అత్యంత క్లిష్ట, కష్ట పరిస్థితుల్లో కలిసివచ్చిన ఈ విజయం.. పార్టీ కేడర్‌లో రెట్టించిన ఉత్సాహం నింపింది.

- Advertisement -

వైసీపీ కంచుకోటగా భావించే రాయలసీమలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. విశాఖ నుంచే పాలన అంటూ అధికార పార్టీ ఊదరగొడుతున్న వేళ.. ఉత్తరాంధ్రలోనూ పసుపుదళం ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రామగోపాలరెడ్డి విజయం సాధించారు.

- Advertisement -

ఇటు సీమ.. అటు ఉత్తరాంధ్ర.. ఓటమికి కారణం చెప్పుకోలేని దుస్థితి వైసీపీది. సలహాదారు సజ్జల రంగంలోకి దిగి.. ఈ గెలుపు ప్రామాణికం కాదని.. పెద్దగా పట్టించుకోమని కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా.. ప్రజలు ఈ గెలుపును పట్టించుకుంటారు. టీడీపీ ఈ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ మాటల్లో చెప్పాలంటే పులివెందుల కోటకు బీటలు తీసుకొచ్చిన గెలుపు ఇది. నెక్ట్స్ తాడేపల్లి ప్యాలెసే అంటూ బాలయ్య తొడకొట్టకుండానే సవాల్ చేశారంటే ఈ విజయం టీడీపీకి ఎంతటి బూస్ట్ ఇచ్చిందో తెలుస్తోంది.

పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభ సూచకం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ ఫలితాలు.. ప్రజా విజయం, మార్పునకు సంకేతం అన్నారు. ఎమ్మెల్సీ విజేతలను ట్విటర్‌ వేదికగా అభినందించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News