Appalanaidu on jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని.. అది దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించి అక్రమ కేసులతో చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర జగన్దని ఆయన గుర్తుచేశారు. ఇటీవల స్కిల్ డెవలప్మెంట్ కేసును కోర్టు కొట్టివేయడమే చంద్రబాబు నిజాయితీకి నిదర్శనమని పేర్కొన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించాల్సింది పోయి.. జగన్ వాటిని సమర్థిస్తూ మళ్ళీ రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని కలిశెట్టి అన్నారు. గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారికే జగన్ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారని ఆరోపించారు. అంబటి వ్యాఖ్యలపై జగన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో గత ఐదేళ్లూ రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరిగిందని.. ప్రజలంతా ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడుతున్నారని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే.. జగన్ మాత్రం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.
జగన్ ఆంధ్రప్రదేశ్లో పది రోజులు కూడా ఉండరని, బెంగళూరు ప్యాలెస్లో ఉంటూ ఇక్కడ కేవలం శవ రాజకీయాలు చేయడానికి మాత్రమే వస్తారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోందని.. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కలిశెట్టి హితవు పలికారు.
Also Read: మురుగు నీరు మాయం.. వాకింగ్ ట్రాక్లు సిద్ధం.. చెరువుల సుందరీకరణపై హైడ్రా ఫోకస్