Nara Bhuvaneshwari: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, అవరోధాలను అధిగమించడం వంటి అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ క్రమంలోనే ఆమె తమ కుటుంబ భద్రతపై, గత జ్ఞాపకాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజల కోసమే తమ కుటుంబం ఉందని, ప్రజాసేవ కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆమె ఉద్ఘాటించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను భువనేశ్వరి ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో నిర్బంధించిన ఘటన తమ జీవితంలో మర్చిపోలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గడ్డు కాలంలో ప్రజలు తమకు అండగా నిలిచారని, జైలు వద్దకు తరలివచ్చిన ప్రజాభిమానమే తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన కష్టాన్ని ప్రజలు మర్చిపోలేదని, అందుకే ఆయన కోసం అంతలా పోరాడారని ఆమె తెలిపారు. “మేము త్యాగాలు చేస్తూనే ఉన్నాం.. అనేక బెదిరింపులను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ మాకు ముప్పు ఉంది. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి” అని భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, తమకు ఇంకా రక్షణ లేదన్న రీతిలో ఆమె మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి భార్య అయి ఉండి, కేంద్రంలో కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉండి కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ బెదిరింపుల వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి.
Read Also: Maoist Encounter: ఏపీలో హిడ్మాకి ఏం పని.. పోలీసుల ట్రాప్లో ఎలా పడ్డాడు?