Nellore Politics: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మారుతున్న రాజకీయాల నేపథ్యంలో నాలుగేళ్లు తర్వాత సిటీ మేయర్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ జాబితాలోకి నెల్లూరు సిటీ మేయర్ స్రవంతి వంతైంది. ఆమె రాజీనామా చేయడం, దాన్ని కలెక్టర్ ఆమోదించడం చకచకా జరిగిపోయింది. తాత్కాలిక మేయర్గా రూప్ కుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు.
రసవత్తరంగా సింహపురి సిటీ పాలిటిక్స్
మారిన రాజకీయాల నేపథ్యంలో నెల్లూరు సిటీ మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు. మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్కు ఇన్ఛార్జ్ మేయర్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉదయం ఉత్తర్వులను జారీ చేశారు.
జిల్లా కలెక్టర్ నివేదిక మేరకు రూప్కుమార్ యాదవ్కు మేయర్గా బాధ్యతలు కేటాయించినట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త మేయర్ ఎంపిక అయ్యేవరకు ఆయన కొనసాగనున్నారు. ఎందుకు మాజీ మేయర్ స్రవంతి రాజీనామా చేశారు? గడిచిన రెండువారాలుగా సింహపురి మేయర్ పీఠంపై ఎందుకు చర్చ జరుగుతోంది? అందుకు స్రవంతి భర్త కారణమా?
కొత్త మేయర్గా రూప్కుమార్, 18న అవిశ్వాసం
వైసీపీ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు సిటీలో 54 కార్పొరేషన్ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. మేయర్గా స్రవంతి బాధ్యతలు చేపట్టారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలోని 42 మంది సభ్యులు సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం 10 మంది మాత్రమే వైసీపీ తరపున సభ్యులు ఉన్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి గమనించిన మేయర్ స్రవంతి శనివారం రాత్రి తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్కు పంపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది. అయితే మేయర్ స్రవంతి అండతో ఆమె భర్త జయవర్ధన్ అవినీతి పాల్పడినట్టు తేలింది.
అంతేకాదు రెండుసార్లు ఆయన జైలుకి వెళ్లారు. మేయర్ పదవి నాలుగేళ్లు పూర్తికావడంతో ఇటీవల అవిశ్వాసం పెడుతూ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్కు నోటీసులు ఇచ్చారు. ఈనెల 18న అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. తనకు బలం లేదని ముందుగానే భావించిన స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.
ALSO READ: ఫ్యాన్ గాలికి రోజా దూరం.. దూరం.. వాళ్లవల్లేనట
ఆమె పంపిన లేఖను జిల్లా అధికారులు ఆమోదించడంతో సింహపురి సిటీలో స్రవంతి శకం ముగిసింది. మేయర్ వివాదానికి పుల్స్టాప్ పడడంతో ఆ జిల్లా టీడీపీ నేతలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు టీమ్.. ఆదివారం సాయంత్రం గోవాకు వెళ్లింది.
ఈనెల 17న నెల్లూరుకు రానున్నారు. ఈలోగా మేయర్ పీఠంపై స్పష్టత కోసం కార్పొరేటర్లు గోవాలో సమావేశం కానున్నారు. నెల్లూరు సిటీ రాజకీయ వ్యవహారాలను వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. కార్పొరేటర్లను ఆపే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి కొత్త మేయర్ ఎవరనేది గురువారం తేలనుంది.