Srikakulam: శ్రీకాకులం జిల్లా పలాసలో అత్యంత దిగ్భ్రాంతికరమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కేవలం ఫోన్ కాల్స్, వీడియో కాల్స్తో భయపెట్టి ఒక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా 1.31 కోట్ల రూపాయలను కాజేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సాగిన ఈ భారీ దగా బాధితుడిని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది.
పలాసలోని రోటరీ నగర్లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముకరావుకు గత మార్చి నెలలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తులు తమను తాము దర్యాప్తు సంస్థల అధికారులమని పరిచయం చేసుకున్నారు. షణ్ముకరావు వాడుతున్న ఫోన్ నంబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) వంటి తీవ్రమైన నేరాలకు వినియోగించబడుతోందని.. ఆయనపై కేసు నమోదైందని నమ్మబలికారు. అంతేకాకుండా.. స్కైప్ వీడియో కాల్ ద్వారా విచారణ చేస్తున్నట్లు నటిస్తూ.. ఆయనను ఎక్కడికీ వెళ్లకుండా ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నామని భయపెట్టారు.
అరెస్ట్ నుంచి తప్పించుకోవాలన్నా.. ఈ కేసు నుంచి బయటపడాలన్నా.. తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బు పంపాలని నిందితులు ఒత్తిడి తెచ్చారు. యూనిఫాంలో ఉన్న అధికారుల ఫోటోలు, నకిలీ నోటీసులను చూపిస్తూ బాధితుడిని తీవ్రమైన మానసిక ఆందోళనకు గురిచేశారు. భయపడిపోయిన షణ్ముకరావు తన జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్మును, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను రెండు నెలల వ్యవధిలో పలు దఫాలుగా నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. మొత్తం 1,31,85,000 రూపాయలను బాధితుడు పోగొట్టుకున్నాడు.
మార్చిలోనే ఈ వ్యవహారం మొదలైనప్పటికీ.. నేరగాళ్ల బెదిరింపుల వల్ల బాధితుడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే.. తాజాగా నిందితులు ఇన్కమ్ టాక్స్ (ఐటీ) క్లియరెన్స్ పేరుతో మరికొంత డబ్బు డిమాండ్ చేయడంతో షణ్ముకరావుకు అనుమానం వచ్చింది. జరిగిన విషయాన్ని తన బంధువులకు వివరించగా.. వారు అది సైబర్ మోసమని గుర్తించారు. వెంటనే బాధితుడు కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. డబ్బు ఏ ఖాతాలకు మళ్లిందో దర్యాప్తు చేస్తున్నారు.
ఏ ప్రభుత్వ సంస్థ లేదా పోలీస్ విభాగం వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేయదు. గుర్తుతెలియని వ్యక్తులు డబ్బు డిమాండ్ చేస్తే వెంటనే 1930 కి కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: Sabari Express: అయ్యప్ప స్వాములు జర్రంతా భద్రం.. ట్రైన్ జర్నీలో చేస్తే ప్రాణాలకే ప్రమాదం..!