Palnadu News: పల్నాటి వారియర్స్ తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో నేపథ్యంలో నాగులేరులో పుణ్య స్నానానికి దిగిన వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఉత్సవాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. అసలు మేటరేంటి? దుర్ఘటన ఎలా జరిగింది?
పల్నాటి వీరుల తిరునాళ్లలో అపశ్రుతి
పల్నాడు జిల్లాలోని కారంపూడి ప్రాంతంలో పల్నాటి వారియర్స్ తిరునాళ్లలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్సవాల చివరిరోజు నాగులేరులో పుణ్య స్నానానికి దిగారు కొందరు. అయితే ఆ వాగులో స్నానం చేస్తుండగా తెగిపడ్డాయి విద్యుత్ వైర్లు. ఈ ఘటనలో స్పాట్ లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఉత్సవాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రతీ ఏటా పల్నాటి వారియర్స్ తిరునాళ్లు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఆచారంగా భావించే ఆయుధాలకు స్నానం చేయించే ఘట్టం అది. సమీపంలోని నాగులేరులోకి ఆయుధాలతో కొందరు దిగారు. అప్పటికే విద్యుత్ తీగ తెగి నీటిలో పడిపోయి ఉంది. ఈ విషయాన్ని గమనించని వారు నీటిలోకి దిగగానే విద్యుదాఘాతానికి గురయ్యారు.
వాగులేరులో విద్యుత్ షాక్, ఒకరు మృతి
మరో వ్యక్తికి స్థానికులు సీపీఆర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏటా జరుపుకునే ఈ ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన జరగడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో తప్పు జరిగిందని, ఎప్పుడూ లేనిది ఈ విధంగా జరగడం ఏంటని ప్రశ్నిస్తున్నవాళ్లు లేకపోలేదు.
పల్నాడు జిల్లా కారంపూడి ప్రాంతంలో పల్నాడు వారియర్స్ని కీర్తిస్తూ ఐదు రోజులపాటు వేడుకలు నిర్వహిస్తున్నారు. 1182 లో జరిగిన పల్నాటి యుద్ధం జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఐదు రోజుల పాటు జరిగే పల్నాటి వీరుల ఆరాధన ఉత్సవం ఈ ప్రాంతంలోని అతి పురాతన వేడుక. శతాబ్దాలుగా ఈ ఉత్సవం కొనసాగుతూ వస్తోంది.
ALSO READ: మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
ఈ ఉత్సవాల్లో ఆ ప్రాంత ప్రజలు కత్తులు, కవచాలు, ఈటెలు, బల్లెములు, గొడ్డళ్ళు వంటి ఆయుధాలను పూజిస్తారు. నలగామరాజు-మలిదేవ రాజుల మధ్య అధికారం కోసం జరిగిన పోరాటం పల్నాటి యుద్ధం. చరిత్ర ప్రకారం.. పల్నాటి యుద్ధం నాగులేరు వాగు ఒడ్డున కారెంపూడి గ్రామంలో జరిగింది. ప్రతి ఏడాది వేడుకల సమయంలో పూర్వీకులు పల్నాటి యుద్ధంలో అమర వీరులను స్మరించుకోవడానికి ఓ పీఠం ఏర్పాటు చేస్తున్న విషయం తెల్సిందే.