Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆర్థిక పరిస్థితి, గత ప్రభుత్వ పాలనా ప్రభావం, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ ప్రగతిపై అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రంతో కూడిన సమగ్ర నివేదికను విడుదల చేశారు. రాష్ట్రంలో భయాందోళనలు తొలగి, మళ్లీ ప్రగతి వైపు ఏపీ అడుగులు వేస్తోందని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
విభజన గాయాలు.. గత ప్రభుత్వ విధ్వంసం
2014 రాష్ట్ర విభజన సమయంలో ఏపీ తీవ్రంగా నష్ట పోయిందన్నారు. 58 శాతం ఉన్న జనాభాకు కేవలం 46 శాతం వనరులు మాత్రమే దక్కాయని తెలిపారు. సొంత రాజధాని కూడా లేకపోవడంతో బస్సుల నుంచే పాలన సాగించాల్సి వచ్చిందని వివరించారు. ఆ కష్టాల నుంచి తేరుకుంటున్న సమయంలో, 2019-24 మధ్య నాటి ప్రభుత్వం తీవ్ర విధ్వంసానికి ఒడిగట్టిందని హర్షం వ్యక్తం చేశారు. వ్యవస్థలు కుప్పకూలిపోయి, శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దీంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా, భయాందోళనల మధ్య పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని తెలిపారు.
2024 తీర్పు.. కూటమి పునర్నిర్మాణం
ప్రజా వేధింపులు, విధ్వంసకర పాలనపై విసిగిపోయిన ప్రజలు 2024 ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం సృష్టించారని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమికి 57 శాతం ఓట్లు, 94 శాతం స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయాన్ని అందించారని.. అధికారంలోకి రాగానే గత వైఫల్యాలపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇప్పుడు రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో ఆర్ధిక పరిస్థితి, అమరావతి, ఎనర్జీ, జల వనరులు వంటి కీలక రంగాలపై ప్రోగ్రెస్ రిపోర్టులను ప్రజల ముందుంచుతున్నాం అని తెలిపారు.
Also Read: అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్లో గ్రాండ్ వెల్కమ్!
అభివృద్ధి బాటలో ఏపీ.. భోగాపురం ఉదాహరణ
ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యక్ష ఉదాహరణ అని వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రస్తుతం డేటా సెంటర్లు, ఐటీ, పోర్టులు, స్టీల్ పరిశ్రమలతో రాష్ట్రానికే ప్రధాన గ్రోత్ ఇంజిన్గా మారుతోందన్నారు. పోలవరం సహా పెండింగ్ ప్రాజెక్టులను పునర్నిర్మిస్తూనే, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై దృష్టి సారించి ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.