Red Sanders Book: ఎర్ర చందనం స్మగ్లింగ్ నెట్వర్క్పై కీలకమైన పుస్తకం రాసినందుకు, డాక్యుమెంటరీ రూపకల్పనకు కీలకమైన సీనియర్ జర్నలిస్ట్ ఉడుముల సుధాకర్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. సుధాకర్ రెడ్డి పర్యావరణంపై నేర సంక్షోభాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కష్టతరమైన ప్రయత్నం చేశారన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఎక్స్ వేదికగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.
“మీరు ఎంతో ప్రమాదకరమైన, శ్రమతో కూడిన అంశాలపై దర్యాప్తు చేసినందుకు నా హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తున్నాను. ప్రజలు ఈ విషయాలు తెలుసుకోవాలి. రెడ్ సాండర్స్ స్మగ్లింగ్పై రౌండ్ టేబుల్ సమావేశం కోసం మిమ్మల్ని త్వరలో ఆహ్వానిస్తాను” అని పోస్టు పెట్టారు పవన్.
సుధాకర్ రెడ్డి ఉడుముల రాసిన ‘బ్లడ్ సాండర్స్: ది గ్రేట్ ఫారెస్ట్ హేస్ట్’ పుస్తకం ఆధారంగా ప్లానెట్ కిల్లర్స్ అనే డాక్యుమెంటరీ రూపొందించారు. ఆంధ్రప్రదేశ్ అడవులను దోచుకుంటున్న రెడ్ సాండర్స్ మాఫియా క్రూరత్వాన్ని ఈ డక్యుమెంటరీ ద్వారా బయటపెట్టినందుకు డిప్యూటీ సీఎం జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డిని ప్రశంసించారు. ఈ డాక్యుమెంటరీలో ఎర్రచందనం చెట్లను నరికి, అక్రమంగా తరలించి, శేషాచలం అడవిని ఎలా నాశనం చేశారో అసాధారణంగా వివరించారని పవన్ కల్యాణ్ అన్నారు.
ఈ చిత్రం ఎర్ర చందనం మాఫియా వెనుక ఉన్న అంతర్జాతీయ కింగ్పిన్లను, జరిగిన క్రూరమైన హింసను ఏపీ కోల్పోయిన అటవీ వీరుల కథలను బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. రాజకీయ మద్దతుతో చెలరేగిపోతున్న సిండికేట్లను పవన్ హెచ్చరించారు. ఎర్రచందనం నెట్వర్క్లో రాజకీయ ముసుగుల వెనుక దాక్కున్న నేరస్థులు సమాజానికి చాలా ప్రమాదకరం అన్నారు. స్మగ్లర్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ.. ఆ డబ్బుతో రాజకీయాలకు ఉపయోగిస్తున్నారన్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఎంతో ధైర్యంగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చి, శేషాచలం అడవి, అంతరించిపోతున్న ఎర్ర చందనం సంపద గురించి ప్రజలకు తెలియజేసినందుకు ఈ డాక్యుమెంటరీ నిర్మాతలను పవన్ ప్రశంసించారు.
సుధాకర్ రెడ్డి ఉడుముల “బ్లడ్ సాండర్స్: ది గ్రేట్ ఫారెస్ట్ హీస్ట్” పుస్తకంలో భారతదేశం అంతటా ఎర్ర చందనం కోసం పనిచేస్తున్న స్మగ్లింగ్ సిండికేట్ల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని అప్పట్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ విడుదల చేశారు. ప్లానెట్ కిల్లర్స్ డాక్యుమెంటరీని మార్టిన్ బౌడోట్ నిర్మించారు. హ్యూగో వాన్ ఓఫెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీలకమైన ప్రదేశాలలో స్మగ్లింగ్ మార్గాలను కళ్లకు కట్టారు.
• శేషాచలం అడవి
• తిరుపతి
• హైదరాబాద్
• గుంటూరు
• కడప
• చెన్నై
• తమిళనాడులోని జవాదు కొండలు
• ఫ్రాన్స్
• లియోన్లోని ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం
• సింగపూర్లోని ఇంటర్పోల్ పర్యావరణ విభాగం
• దుబాయ్, స్మగ్లర్ సాహుల్ హమీద్ను చివరికి గుర్తించారు
దశాబ్దాలుగా పాతుకుపోయిన ఎర్ర చందనం స్మగ్లింగ్ నెట్వర్క్ను ట్రాక్ చేసిన సుధాకర్ రెడ్డి ఉడుముల ఈ డాక్యుమెంటరీలో రూపొందడానికి కీలకంగా పనిచేశారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.
Also Read: Andhra Pradesh: విశాఖలో రెండో రోజు.. CII పార్టనర్ షిప్ సమ్మిట్..
ఈ డాక్యుమెంటరీ కోసం విస్తృతమైన గ్రౌండ్ రిపోర్టింగ్ చేశారు. మారుమూల అటవీ భూభాగంలోకి ట్రెక్కింగ్, పలు రాష్ట్రాలలో చెట్ల నరికివేతలు, స్మగ్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులను ఇంటర్వ్యూ చేయడం చాలా ఛాలెంజింగ్ పని. ఈ చిత్ర బృందం చెన్నైలో రెడ్ సాండర్స్ నెట్వర్క్ మూలాలను చిత్రీకరించింది. అలాగే మోస్ట్ వాంటెండ్ గంగి రెడ్డి వంటి కీలక నిందితులను ఇంటర్వ్యూ చేసింది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలపై సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల కృతజ్ఞతలు తెలిపారు. ఎర్ర చందనం రక్షణ కోసం భాగస్వామ్యం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.