Pawan Kalyan: జనసేన పార్టీపై ఎటువంటి దుష్టశక్తుల దృష్టి పడకుండా నిరంతరం కాపుకాస్తున్న జనసైనికులు, వీర మహిళలు, నాయకులు సర్వదా ప్రశంసనీయులని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీకి చెందిన కొందరు ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన.. పార్టీ సంస్థాగత అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రయాణం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత, కుల విభేదాలను జనసేనపై మోపేందుకు కొందరు కిరాయి వ్యక్తులు, కిరాయి మాధ్యమాలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వంటి వ్యక్తిగత అంశాలను కూడా పార్టీకి అంటగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి తప్పుడు ప్రచారాలను పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాలని.. ప్రజల్లో నిజాలు స్పష్టంగా తెలియజేయాలని ఆయన సూచించారు.
జనసేన పార్టీ రాజ్యాంగబద్ధంగా.. ప్రజాసేవనే పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పార్టీ ప్రయాణం ఆప్రతిహతంగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రయాణంలో తోడునీడగా నిలుస్తున్న జనసేన శ్రేణులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే.. అన్ని వేళలా జనసైనికులు, పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని.. తప్పుడు ప్రచారాలు, కుట్రల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. కులాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించి పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలను సమైక్యతతో, శాంతియుతంగా, ధైర్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రతిష్ఠను కాపాడటం ప్రతి జనసైనికుడి బాధ్యత అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా పేర్కొన్నారు.
ALSO READ: ఓటమికి కారణమంటూ కోర్టుకు ఈడ్చారు.. మనస్తాపంతో చెరువులో దూకి వృద్ధురాలు మృతి