ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.పదవుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీతో వారిలో ఆశలు చిగురించాయి. మంగళగిరిలో హనుమాన్ ప్రాజెక్టు కార్యక్రమం పూర్తయిన వెంటనే పవన్ కళ్యాణ్ ఉండవవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు వీరి మధ్య సుదీర్ఘ భేటీ జరిగింది.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, వాటి నిర్వహణపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.
కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్, స్థానిక ఎన్నికల మధ్య పొత్తు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తున్నది.సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెద్దగా ఎన్నికలు జరగలేదు. పదవుల విస్తరణ కూడా కాలేదు. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నది.ఈ క్రమంలోనే కూటమి పొత్తులో భాగంలో స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబును కోరినట్టు ప్రచారం జరుగుతోంది.ఇక ఇరు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ విషయంలో చర్చ జరిగిందన్న సమాచారంతో ఆశావహులు యాక్టివ్ అయ్యారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల్లో తమకు ప్రాధాన్యం కల్పించాలని ఆశావహులు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్ ఆశించి భంగపడిన వారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రిక్తహస్తంతో వెనుదిరిగిన నేతలు తమకే చాన్స్ ఇవ్వాలని తెలుగుదేశం, జనసేన పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక బడా నేతలు, మంత్రులు, ఎంపీలు తమ అనుచరులకు స్థానిక ఎన్నికల్లో చాన్స్ ఇవ్వాలని వారు సైతం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.అవసరమైతే ఎన్నికల ఖర్చును తామే భరిస్తామని సైతం చెప్పుకుంటున్నట్టు తెలుస్తోంది.
కొందరు నేతలు పదవుల కోసం లాబీయింగ్ చేస్తుంటే మరికొందరు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను నమ్ముకున్నట్టు తెలుస్తున్నది. మహిళా కోటా, రిజర్వేషన్, జనరల్ ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా క్యాలికులేషన్స్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలకు అధిక ప్రయారిటీ దక్కిందని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఎక్కువ సీట్లు, పోస్టులు రాబట్టాలని జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆ పార్టీ శ్రేణులు వేడుకుంటున్నట్టు తెలిసింది. ఆయన సైతం చంద్రబాబుతో మాట్లాడక ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం.కాగా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం గురించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. వీరి భేటీకి సంబంధించిన వివరాలు బయటకు రాకముందే ఆశావహులు మాత్రం పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమకు చాన్స్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.