![Pensions Distribution In AP](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/AP-PENSIONS-1280-x-720-2.jpg)
Pensions Distribution In AP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అరకొరగా మొదలైంది. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను ఎన్నికల కమిషన్ విధుల నుంచి తప్పించడంతో గందరగోళం నెలకొంది. సాధారణంగా ఒకటో తేదీనే వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ అందించేవారు. దీంతో ఏ సమస్యా లేకుండా లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందేది.
ఈసీ నిబంధనల కారణంగా ఈ సారి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం, సచివాలయ సిబ్బంది మధ్య గందరగోళం ఏర్పడటంతో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు బుధవారం నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే చాలా ప్రాంతాల్లో సచివాలయాలకు నగదు సమయానికి చేరకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
గుంటూరులోని సచివాలయాల వద్ద ఉదయం నుంచే పెన్షన్ కోసం లబ్ధిదారులు బారులు తీరారు. పెన్షన్దారుల కోసం అన్ని ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నా.. సచివాలయాలకు వెళ్లిన పింఛన్దారులకి డబ్బులు లేవని సమాధానం రావడంతో డీలా పడుతున్నారు. ఉదయం 10 గంటలకు సచివాలయానికి రావాలని తమకు మెసేలు పెట్టారని తీరా ఇక్కడికి వస్తే డబ్బులు ఇంకా రాలేదని సమాధానం చెబుతున్నారని వృద్ధులు ఆవేదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగుల, వితంతువుల పింఛన్లు కోసం సచివాలయాల సమీపంలో పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటలకే పింఛన్దారులు సచివాలయాలకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత పింఛన్లు పంపిణీ చేస్తామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో విసుగు చెందుతున్నారు.
మరోవైపు అధికార పార్టీ కావాలనే పింఛన్లు లేటు చేస్తోందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల కోడ్ రాక ముందు ఒకటో తేదీనే అందించే పింఛన్లు.. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తున్నాయి.
Also Read: పెన్షన్ల పంపిణీపై ఈసీ మార్గదర్శకాలు జారీ.. ఈనెల 6లోగా పూర్తి చేయాలని ఆదేశం..
ఎన్నికల కమిషన్ నిబంధనలతో వాలంటీర్ల సేవలకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఒకటో తేదీకే అందాల్సిన పింఛన్లు 3వ తేదీ వచ్చిన ఇంకా అందలేదు. ఈ రోజు నుంచి సచివాలయాలలో పింఛన్ లు అందుతాయని వృద్దులు, వికలాంగులు బారులు తీరారు. సచివాలయాలకు నగదు చేరకపోవడంతో సచివాలయాల వద్ద వృద్దులు బారులు తీరారు. ఎండలోనే గంటలపాటు నిరీక్షిస్తున్నారు.