Kurnool: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్వాటర్ పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న వేళ అపశ్రుతి చోటు చేసుకుంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు సంబంధించి 3, 9వ గేట్లను ఎత్తుతుండగా రోప్ తెగిపోయింది. గేట్లను పైకి ఎత్తుతున్న సమయంలో 9 వ నెంబర్ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోవడంతో భారీ బరువు ఉండే ఐరన్ గేటు అదుపు తప్పి కిందపడిపోయింది.
ఘటనతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. శ్రీశైలం జలాశయం నుంచి బ్యాక్వాటర్ ప్రవహిస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. గేటు కిందపడి పోవడంతో నీటి విడుదలకు అంతరాయం ఏర్పడినట్టు చెబుతున్నారు. జరిగిన ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం. దెబ్బతిన్న గేటు మరమ్మతు పనులపై చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. నాలుగేళ్ల కిందట వైసీపీ హయాంలో 10 గేటు రోప్ తెగిపోయింది. ఆనాడు మరమత్తులకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైందని అంటున్నారు.
ప్రమాదం జరిగినప్పటికీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం జలాలకు ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు అధికారులు. ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. హెడ్ రెగ్యులేటర్ ఆధారంగా కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు గంగ కాలువలకు నీటి విడుదల సాగుతోందని తెలిపారు.
ALSO READ: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?