పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మరల దానిని కాపాడుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటాయి. ప్రజలు పార్టీలకు అధికారం కట్టబెట్టినప్పుడు వారి పదవీకాలం ఐదేండ్లు ఉంటుంది. ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల మంచి, చెడు గురించి పట్టించుకుంటారో, అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తారో అటువంటి వారికే మరల ప్రజలు పట్టం కడతారు. కానీ, ఈ మధ్యకాలంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఫైట్ చేసే పార్టీలు.. ఎన్నికల ముందు మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని వాగ్దానాలు ఇస్తుంటారు.తీరా అధికారం కట్టబెట్టాక ఏడాది తిరగకముందే వాటిని మర్చిపోతుంటాయి.
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు పెద్దగా పదవుల తలనొప్పి ఉండదు. వారి గోల్ అంతా ఒకటే. అధికారంలోకి రావడం. తీరా అధికారం దొరికాక వారికి పదవుల పంచాయితీలు మొదలవుతాయి.సీనియర్లు, జూనియర్లు, కులాలు, వర్గాల వారీగా అందరినీ మెప్పించాలి. పొలిటికల్ అడ్జస్ట్మెంట్ భాగంలో కొందరికి పదవులు దొరకచ్చు. కొందరికి దొరక్కపోవచ్చు. దొరికిన వారికి హ్యాపీ.. దొరకని వారిలో అసహనం, అసంతృప్తి.. పార్టీ మారేందుకు, వచ్చే ఎన్నికల్లో పార్టీకి సహాయ నిరాకరణ తప్పదు. ఒక్కోసారి వెన్నుపోట్లు తప్పవు.దీనికి తోడు అడ్మినిస్ట్రేషన్ టెన్షన్.ఈ తలనొప్పుల్లో పడి అధికార పార్టీలు ప్రజలను మర్చిపోతాయి. వారికి ఇచ్చిన హామీలను విస్మరిస్తాయి. ఇదే వారి పతనానికి నాంది అవుతుంది.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పాలనలో జరిగిన ప్రతిమీటింగులో ఆయన చెప్పుకొచ్చింది ఒకటే. తమ పార్టీ 30 ఏండ్ల పాటు అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. పరిపాలన వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు అంటూ ఏదేండ్లు గడిపారు. పాలన గాలికొదిలేసి అప్పులు చేస్తూ, సంక్షేమం పేరిట ఉచితంగా డబ్బులు పంచారు. తీరా చూస్తే నో డెవలప్మెంట్. పైగా అప్పులు, నిరుద్యోగం.. మరోవైపు వైసీపీ నేతల దాడులు, అవినీతి అక్రమాలు. ఈ గందరగోళం నడుమ ఎన్నికలకు వెళ్లే ముందు వై నాట్ 175 అంటే.. ప్రజలు 11 సీట్లు చేతిలో పెట్టారు. తీరా చూస్తే తప్పు ఎక్కడ జరిగిందో జగన్కు కూడా అర్థం కాలేదు. ప్రజలను పట్టించుకోకుండా సొంత లాభం చూసుకుంటే జనాలు బలంగా బుద్దిచెబుతారడానికి ఇదో నిదర్శనం..
ఇటీవలి కాలంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారాలోకేశ్ సైతం తాము పది నుంచి 15 ఏళ్ల వరకూ అధికారం తమదే చెప్పుకుంటున్నారు.ఇది దేనికి సంకేతం.కళ్లముందే జగన్కు జరిగిన పరాభవం వారికి కనిపిస్తున్నది. వచ్చేది మన ప్రభుత్వమే అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ అందుకు నిత్యం కృషి, జనాల బాగోగులు, ఇబ్బందులు తెలుసుకోవడం ముఖ్యం.దాంతో పాటే క్షేత్రస్థాయిలో నేతల పనితీరును మానిటర్ చేయాలి. పార్టీలోని అసంతృప్తిని ముందు చల్లార్చాలి.ఇలా అందరినీ సంతృప్తి పరిస్తేనే మరోసారి అధికారం దక్కుతుంది. జగన్ చేసిన తప్పులు చేస్తే పవన్, లోకేశ్కు ఏపీ ప్రజలు మరోసారి హ్యాండ్ ఇవ్వడం ఖాయం. అందుకే రాబోయే మూడేండ్లలో వారికి పాలనకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారో.. మరోసారి అధికారంలోకి వస్తామన్న జగన్ మాట నెగ్గుతుందా? పవన్, లోకేశ్ మాట నెగ్గుతుందా? వేచి చూడాల్సిందే.