Proterial Sri City AP: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. అమెరికా.. జపాన్ దేశాలకు చెందిన ప్రముఖ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో అత్యాధునిక ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘మెట్ గ్లాస్ ఇండియా’ (Metglas India) పేరుతో ఈ నూతన కంపెనీని స్థాపించనున్నారు. ఈ ప్లాంట్ ప్రధానంగా విద్యుత్ రంగంలో కీలకమైన ‘అల్లాయ్ రిబ్బన్’ ఉత్పత్తిపై దృష్టి సారించనుంది. తొలిదశలో సుమారు 77 మిలియన్ డాలర్ల (సుమారు ₹650 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు యాజమాన్యం సిద్ధమైంది.
ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 200 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. కంపెనీ ఆపరేషన్స్ 2026 అక్టోబర్ నాటికి ప్రారంభమవుతాయని సంస్థ సీఈఓ శాన్ స్టాక్ వెల్లడించారు. ఈ ప్లాంట్లో జపాన్కు చెందిన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించబోతున్నారు. తొలిదశలో ఏడాదికి 30 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ప్రతినిధులు తెలిపారు.
స్థానిక యువతకు ఈ ప్లాంట్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కంపెనీ స్పష్టం చేయడం విశేషం. ఉద్యోగాలకు ఎంపికైన పలువురు స్థానిక అభ్యర్థులకు అధునాతన సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు జపాన్ పంపించనున్నట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా బలం చేకూరుతుంది. శ్రీ సిటీలోని మౌలిక సదుపాయాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల వల్లే ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ భారీ పెట్టుబడితో రాష్ట్రం ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తిలో కీలక హబ్గా మారే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Botsa Health: బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర చికిత్స