Vegetarian Diet: తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనిందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల దాదాపు 18 లక్షల మందిపై నిర్వహించిన ఓ తాజా పరిశోధనలో శాకాహారులకు ఐదు రకాల క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. ముఖ్యంగా మాంసాహారులతో పోలిస్తే శాకాహారం తీసుకునే వారిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 21 శాతం, ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు 12 శాతం తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. శాకాహారుల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా 9 శాతం తక్కువగా ఉంది. భారతదేశం లోనూ ప్రాణాంతకంగా మారుతున్న ప్యాంక్రియాటిక్, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్లు మొత్తం క్యాన్సర్ మరణాలలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇవే కాకుండా కిడ్నీ క్యాన్సర్ ముప్పు 28 శాతం, మల్టిపుల్ మైలోమా ముప్పు 31 శాతం వరకు తగ్గుతున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రాణాంతక వ్యాధుల నుండి మనల్ని ఎలా కాపాడుతాయో తెలియజేస్తోంది.
Also Read: కాఫీ కంటే రాగి జావ ఎంత మంచిదే తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనంలో సుమారు 17 రకాల క్యాన్సర్లపై పరిశోధనలు చేశారు. గతంలో జరిగిన పరిశోధనల్లో శాకాహారుల సంఖ్య తక్కువగా ఉండటంతో స్పష్టమైన ఫలితాలు వచ్చేవి కావు. కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ అధ్యయనాలను కలిపి సుమారు 16 ఏళ్ల పాటు డేటాను విశ్లేషించారు. దీనిలో 1.6 లక్షల మంది మాంసాహారులు, వేల సంఖ్యలో చికెన్ తినేవారు, చేపలు తినేవారు, శాకాహారుల జీవనశైలిని నిశితంగా పరిశీలించారు.
అయితే, కేవలం శాకాహారం వల్లే అన్నీ సాధ్యమని అనుకోవడం పొరపాటని కూడా ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. శాకాహారులలో బి విటమిన్లు వంటి అవసరమైన పోషకాలు లోపిస్తే ఎసోఫాగియల్ క్యాన్సర్ వచ్చే ముప్పు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే పాలు, పెరుగు వంటివి కూడా తీసుకోని వీగన్లలో కాల్షియం లోపం వల్ల పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి.. శాకాహారం తీసుకునేటప్పుడు శరీరానికి కావలసిన అన్ని విటమిన్లు, ఖనిజాలు అందేలా సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: డల్ స్కిన్తో విసిగిపోయారా? పెరుగులో వీటిని కలిపి వాడితే చర్మం నిగారిస్తుంది!