Arava Sridhar MLA: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యే తనను మోసం చేశారని గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న హర్షవీణ అనే మహిళ, తాజాగా మరిన్ని వీడియో చాటింగ్లను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ కేవలం తనతోనే కాకుండా, మరికొందరు మహిళలతో కూడా సన్నిహితంగా ఉన్నారని, వారికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ వీడియో చాటింగ్ ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. గత పది రోజులుగా ఆమె గంటకో వీడియోను విడుదల చేస్తూ ఎమ్మెల్యేను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ వరుస వీడియోలతో అటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీ వర్గాల్లోనూ తీవ్ర చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే శ్రీధర్పై హర్షవీణ చేసిన ఆరోపణలను జనసేన పార్టీ అధిష్టానం అత్యంత సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంపై వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు పార్టీ తరపున ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, బాధితురాలి నుంచి వివరాలను సేకరించింది. హర్షవీణ విడుదల చేసిన వీడియోలు, సోషల్ మీడియా ఆధారాలను పరిశీలించిన కమిటీ, తన తుది నివేదికను పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణ చర్యలు ఉండవచ్చని, పార్టీ నుంచి ఆయనపై వేటు పడే అవకాశం ఉందని జనసేన వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
రాజకీయంగా ఈ పరిణామాలు జనసేన పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారాయి. ప్రజా ప్రతినిధుల ప్రవర్తన విషయంలో పవన్ కళ్యాణ్ కఠినంగా ఉంటారని పేరున్న నేపథ్యంలో, శ్రీధర్ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఉత్కంఠగా మారింది. ఒకవైపు హర్షవీణ వరుస వీడియోలతో సోషల్ మీడియాలో దాడి కొనసాగిస్తుండగా, ఎమ్మెల్యే మద్దతుదారులు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర అని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా, రైల్వేకోడూరు ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా హాట్ టాపిక్గా మారింది.
Read Also: Arava Sridhar Case: ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు.. ఎమ్మెల్యే శ్రీధర్కు ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం!