Dwcra Group: ఏపీలో డ్వాక్రా సంఘాల మహిళలు ఊరట లభించింది. ఇప్పటివరకు మహిళలు తీసుకున్న రుణాలపై రకరకాల పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేసేవి బ్యాంకులు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో బ్యాంకులు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఫీజుల విషయంలో వెనక్కి తగ్గగా, గ్రామీణ బ్యాంకు అందులోకి చేరింది. ఫలితంగా సేవా ఛార్జీలను మాఫీ చేసింది. దీనివల్ల 30 లక్షల మందికి ఊరట లభించింది.
స్వయం సహాయక సంఘాల-డ్వాక్రా మహిళలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఆయా సంఘాల ఉపాధి కార్యకలాపాలకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో గ్రామీణ బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై సర్వీస్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూలై 1 నుంచి తీసుకున్న రుణాలకు వర్తిస్తుందని వెల్లడించింది. మహిళలు ఇప్పటివరకు రుణాలు తీసుకునే సమయంలో రకరకాల ఫీజుల పేరుతో బ్యాంకులు సర్వీసు ఛార్జ్ విధించేది. వాటిలో ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, లెడ్జర్ ఫోలియో ఫీజు, పాస్బుక్ అప్డేషన్, ఎస్హెచ్జీ స్టేట్మెంట్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ వంటి ఉండేవి.
ఫలితంగా రుణం తీసుకునే మహిళలపై అదనపు భారం పడేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బ్యాంకులు మార్పులు చేయడం మొదలుపెట్టాయి. ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు, ఇన్స్పెక్షన్ ఫీజు వసూళ్లను నిలిపి వేశాయి. ఈ జాబితాలోకి ఏపీ గ్రామీణ బ్యాంకు చేరింది. సర్వీస్ ఛార్జీల రద్దుతో పాటు మరొక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటివరకు రూ.5 లక్షలకు మించిన రుణాలపై 13 శాతం వడ్డీ వసూలు చేసేవి. దాన్ని 12 శాతానికి తగ్గించింది. వడ్డీ రేటు తగ్గడంతో రుణాలు తీసుకునే మహిళలకు అదనపు ప్రయోజనం కలగనుంది. సున్నా వడ్డీ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు అధికారులు.
రుణాలపై నెలవారీ లేదా నిర్ణీత వాయిదాల గడువులోగా చెల్లించిన సంఘాలకు ఈ రాయితీలు వర్తిస్తాయని తెలిపారు. చెల్లింపులో జాప్యం జరిగితే పథకాల ప్రయోజనాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించారు. సేవా ఛార్జ్ రద్దు చేయడం వల్ల ప్రతి డ్వాక్రా సంఘానికి ఏడాదికి సుమారు రూ.25 వేల వరకు ఆదా. గ్రామీణ బ్యాంకులతో అనుసంధానమైన సుమారు 2.75 లక్షల మహిళా సంఘాలు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. వడ్డీ రేటు తగ్గింపుతో ఆర్థిక ప్రయోజనం కలగనుంది. రూ. 20 లక్షల రుణాన్ని మూడేళ్లలో చెల్లిస్తే.. ఒక్కో సభ్యురాలికి సుమారు రూ.1500 వరకు లబ్ది చేకూరనుంది. సేవా ఛార్జ్ రద్దు కావడంతో ఏపీ గ్రామీణ బ్యాంకు పరిధిలో సభ్యులకు ఏడాదికి రూ.500 కోట్ల మేరా లబ్ధి చేకూరనుంది.
ALSO READ: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్.. గుజరాత్ నుంచి ఏపీకి తరలింపు