Nara Lokesh AI video: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్ బ్రాండ్ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ తన మొట్టమొదటి భారీ తయారీ కేంద్రాన్ని తమిళనాడు వెలుపల.. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని (ప్రస్తుత తిరుపతి జిల్లా) సత్యవేడులో సుమారు రూ. 2,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ను నెలకొల్పనున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ భారీ పెట్టుబడిని స్వాగతిస్తూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన ఏఐ (AI) జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ను నడుపుతూ కనిపించి నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఏపీని ఆటోమొబైల్ హబ్గా మార్చే దిశగా ఇది కీలక పరిణామమని ప్రభుత్వం భావిస్తోంది. లోకేష్ తన పోస్ట్లో కంపెనీ పెట్టుబడిని ధృవీకరిస్తూ.. “త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వీధుల్లో ఈ గంభీరమైన ఇంజిన్ శబ్దాలు మారుమోగనున్నాయి.” అని పేర్కొన్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం సుమారు 267 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో కేవలం తయారీ యూనిట్ మాత్రమే కాకుండా.. విడిభాగాల తయారీదారుల కోసం ప్రత్యేకంగా ‘వెండర్ పార్క్’ కూడా ఉండటం విశేషం. ఈ ప్రాజెక్ట్ రెండు దశల్లో పూర్తి కానుంది. మొదటి దశను 2029 నాటికి.. రెండో దశను 2032 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా 9 లక్షల అదనపు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో పాటు.. సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉపాధి లభించనుంది.
Guess who’s coming to AP? pic.twitter.com/6JvNA15DXS
— Lokesh Nara (@naralokesh) May 7, 2026
Read Also: తమిళ రాజకీయంలో ‘దళపతి’ మార్క్ వ్యూహం.. సొంత మీడియా వైపు విజయ్ అడుగులు?