పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన ఓ బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. వ్యాపారికి ‘రుచి’ అనే పేరుతో ఫేస్బుక్లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను అంగీకరించడంతో ఈ వ్యవహారం మొదలైంది. గుర్తు తెలియని ఆ యువతి కొన్ని రోజులు వ్యాపారితో ఛాటింగ్ చేస్తూ పరిచయాన్ని పెంచుకుంది.
చాటింగ్ ద్వారా నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, ఆ యువతి వ్యాపారిని మోసగించేందుకు పన్నాగం రచించింది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం, వెండిని పంపిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన ఆ బంగారం వ్యాపారి, ఆమె చెప్పిన అకౌంట్కు దఫదఫాలుగా మొత్తం రూ. 20 లక్షలు పంపించాడు.
అయితే, డబ్బు పంపిన తర్వాత చాలా రోజులైనా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె నుంచి ఎటువంటి స్పందనా లభించకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్లపై దర్యాప్తు ప్రారంభించారు.