బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీలో రాజకీయ రచ్చగా మారింది. తన ఫోన్ ట్యాప్ చేశారని, అది తన అన్న జగన్ కి కూడా తెలుసని ఆరోపిస్తున్నారు షర్మిల. అంతే కాదు, అందుకు వైవీ సుబ్బారెడ్డి సాక్ష్యం అని కూడా చెప్పారు. షర్మిల ఆరోపణల తర్వాత వైవీ కూడా తెరపైకి వచ్చారు. తనకేపాపం తెలియదన్నారు. అసలీ విషయంలో ఎల్లో మీడియా రచ్చ చేస్తోందన్నారు. వారు తప్పుడు వార్తలు ఇచ్చారు కాబట్టే తాను వివరణ ఇవ్వాల్సి వస్తోందన్నారు వైవీ.
గత తెలంగాణ ప్రభుత్వం షర్మిలగారి ఫోన్ ట్యాప్ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా,షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారు.అప్పుడు జగన్గారికి, షర్మిలగారికి సంబంధాలు ఇలా లేవు. 1/2
— Y V Subba Reddy (@yvsubbareddymp) June 18, 2025
వైవీకి అంతా తెలుసు..
ఇక్కడ వైవీ సుబ్బారెడ్డి ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిన విషయం ఒకటుంది. షర్మిల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైవీ సుబ్బారెడ్డికి కూడా తెలుసు అని మొదట చెప్పింది మీడియా కాదు, షర్మిలనే. షర్మిలే స్వయంగా ఈ విషయం బయటపెట్టారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో వైవీ తనను ముందుగానే హెచ్చరించారని అన్నారు. అయితే ఇప్పుడు వైవీతోపాటు, జగన్ కూడా కవరింగ్ గేమ్ మొదలు పెట్టడంపై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
phone tap proof yv subba reddy daggara unnay – ys sharmila pic.twitter.com/V4KbqbQIWg
— TeluguThinker (@teluguInUs) June 19, 2025
ఆలీబాబా 40 దొంగలు..
జగన్ తీరు ఆలీబాబా 40 దొంగల మాదిరిగా ఉందన్నారు షర్మిల. దొంగ ఎక్కడైనా దొంగ అని ఒప్పుకుంటాడా ? అని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి దగ్గర ట్యాప్ అయిన తన ఆడియో ఉందని, ఆ విషయం నిజమో కాదో.. వైవీ సుబ్బారెడ్డి చెప్పాలన్నారు. కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలంటూ వైవీని డిమాండ్ చేశారు షర్మిల. అసలు వైవీ చేతికి తన ఆడియో ఎలా వచ్చిందని ప్రశ్నించారామె. వైవీకి ఎవరో ఆడియో ఇచ్చారని, అది ఎవరో తేలాలన్నారు. వైవీని కూడా విచారణకు పిలవాలని, ట్యాపింగ్ నిజాలు నిగ్గు తేల్చాలన్నారు షర్మిల.
ఎటూ చెప్పలేని వైవీ..
జగన్, షర్మిల ఇద్దర్లో ఎవర్నీ వైవీ కాదనుకోలేరు. ఏపీలో రాజకీయ అవసరం ఉంది కాబట్టి ఆయన కచ్చితంగా జగన్ వైపు మాట్లాడాల్సిందే. అయితే షర్మిల గురించి కూడా ఆలోచించారు కాబట్టి ఆమెను ముందుగానే హెచ్చరించారు వైవీ. ఆ విషయం మాత్రం జగన్ కు చెప్పినట్టు లేరు. దీంతో ఆయన ఇప్పుడు ఇరుకున పడ్డారు. వైవీ గతంలో తన ఇంటికి వచ్చి, తన ఫోన్ ఆడియోని తనకే వినిపించారని చెబుతున్నారు షర్మిల. తన బిడ్డలమీద, బైబిల్ పై కూడా ప్రమాణం చేసి నిజం చెబుతున్నానని అన్నారామె. తాను ఆర్థికంగా,రాజకీయంగా ఎదగకూడదనే ఉద్దేశంతోనే తనపై నిఘా పెట్టారని, తాను ఎవర్ని కలుస్తున్నామనే విషయాలను తెలుసుకున్నారని, తనకు సపోర్ట్ ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపి వేశారన్నారు.
అదే జరిగి ఉంటే..
రెండు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతోందన్నారు. ఒకవేళ తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ విషయం వెలుగులోకి వచ్చి ఉండేది కాదన్నారామె. ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపించాలన్నారు. వైవీ సుబ్బారెడ్డిని కూడా విచారణకు పిలిపించాలని చెప్పారు షర్మిల. దీంతో ఇప్పుడీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.