Sharmila Vs Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు షర్మిల.విజయమ్మ లెటర్ తర్వాత వైసీపీ నేతలు చేస్తున్న హంగామాపై మండిపడ్డారు. ఎందుకు నేరుగా వచ్చి జగన్ స్పందించలేకపోతున్నారు? నేతలను రంగంలోకి దింపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. అసలేం జరుగుతోంది?
జవాబు చెప్పే దమ్ము జగన్కు ఉందా?-షర్మిల
వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం ముదిరిపాకాన పడింది. ఓ వైపు జగన్-షర్మిల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. రీసెంట్ విజయమ్మ రాసిన లేక జగన్ ఫ్యామలీలో దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై నేరుగా స్పందించలేదు. కేవలం వైసీపీ నేతలు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై సొంత అన్నను దుమ్ముదులిపేశారు షర్మిల. సోమవారం మీడియా ముందుకొచ్చిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
తల్లి విజయమ్మ రాసిన లేఖకు సమాధానం చెప్పే దమ్ము జగన్కు లేదని తేల్చేశారు షర్మిల. అందుకే ఆ లేఖ ఫేక్ అంటూ ఆ పార్టీ సైతాన్ సైన్యం చేత చెప్పడంపై మండిపడ్డారు. లేఖపై విజయమ్మ సంతకం పెట్టలేదంటూ తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తల్లి రాసిన లేఖ అబద్ధమైతే ఛానెల్ రిపోర్టర్ను పంపి బైట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్న రైజ్ చేశారు.
సైతాన్ సైన్యంతో ప్రచారమా? జగన్పై షర్మిల ఆగ్రహం
అలా చేయకపోతే లేఖ రాసిన విషయం నిజమేనని అన్నారు. ఈ లెక్కన జగన్ విశ్వసనీయత కోల్పోయారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో సాక్షి పేపర్లో తాటికాయంత అక్షరాలతో ‘సత్యమేవ జయతే’అంటూ వైఎస్సార్ ఫొటో పెట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్న జగన్ మాదిరిగా తనకు స్వార్థ రాజకీయాలు తెలియవని తేల్చిచెప్పారు.
ఆస్తులు, పదవుల కోసం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారాల్సిన అవసరం తనకు లేదని కుండబద్దలు కొట్టేశారు. జగన్ను జైలుకు పంపేందుకు తాను కుట్రలు పన్నినట్లు ప్రచారం చేయడంపై రుసరుసలాడారు. ఆస్తులు కావాలని ఆయన్ని అడిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన పరిస్థితి తనకు లేదన్నారు.
ALSO READ: దాచేపల్లిలో గ్యాస్ కష్టాలు.. గంటల తరబడి క్యూలో సామాన్యుడి పాట్లు
విజయమ్మ.. వైఎస్సార్ భార్య అని, ఆయనలో సగమని గుర్తు చేశారు. నలుగురు మనవళ్లకు సమానంగా ఆస్తులు పంచాలని వైఎస్సార్ ఆదేశం మేరకు లేఖలో పేర్కొన్నారని అన్నారు. ఆస్తుల విషయంలో గోబెల్స్ ప్రచారం చేయొద్దని, ఈ విషయం సంస్కారం ఉన్నవాళ్లకు అర్థమవుతుందన్నారు. అసలు లేఖ నిజం కాకుంటే విజయమ్మ స్వయంగా క్లారిటీ ఇచ్చేవారని అన్నారు.
ఇంత జరుగుతున్నా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారంటే కుక్కలు మొరుగుతున్నాయని అనుకుంటానని అన్నారు. అమ్మ రాసిన లెటర్ అంతా వాస్తవమని తెలిసి జగన్ కూడా సైలెంట్గా ఉన్నారని తెలిపారు. అదే సమయంలో వివేకానంద హత్య గురించి కూడా ప్రస్తావించారు.