Petrol Price: అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం సామాన్యుడి జేబుపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో (అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్) కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) ధరలు భారీగా పెరిగాయి. తాజా గణాంకాల ప్రకారం, బ్యారెల్ ముడి చమురు ధర 110 డాలర్ల మార్కును దాటిపోయింది. ఈ పరిణామం నేరుగా దేశీయ ఇంధన ధరలపై ప్రభావం చూపుతుండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళన మొదలైంది.
హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద బారులు
యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందని, పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. ఈ వార్తలతో అప్రమత్తమైన వాహనదారులు తమ వాహనాల ట్యాంకులను ఫుల్ చేయించుకునేందుకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని అంబర్పేట్, కాచిగూడ, ఉప్పల్ వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు కూడా బంకులు రద్దీగా కనిపిస్తున్నాయి.
పవర్ పెట్రోల్ ధరలో పెరుగుదల
సాధారణ పెట్రోల్ ధరల్లో మార్పు రాకముందే, ప్రీమియం వెర్షన్ అయిన పవర్ (Power/Speed) పెట్రోల్ ధరపై చమురు కంపెనీలు ఇప్పటికే బాదుడు మొదలుపెట్టాయి. మార్చి 20వ తేదీ నుంచి లీటరు పవర్ పెట్రోల్ ధరపై దాదాపు రూ. 2.09 నుండి రూ. 2.35 వరకు పెరిగింది. సాధారణ పెట్రోల్తో పోలిస్తే ప్రీమియం పెట్రోల్ ధరలు పెరగడం, రాబోయే రోజుల్లో సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయనే సంకేతాలను ఇస్తోంది.
సరఫరాలో అంతరాయం – ‘నో స్టాక్’ బోర్డులు
పెట్రోల్ బంకులకు చమురు కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేసి, నగదు చెల్లిస్తేనే స్టాక్ పంపిస్తామని కండిషన్లు పెడుతున్నాయి. దీనివల్ల దాదాపు 20% నుండి 30% వరకు బంకుల్లో స్టాక్ కొరత ఏర్పడింది. అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో కొన్ని బంకుల వద్ద ఇప్పటికే ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రజలంతా ఒక్కసారిగా బంకులకు రావడంతో ఉన్న స్టాక్ కూడా గంటల వ్యవధిలోనే అయిపోతోంది.
హార్ముజ్ జలసంధి ప్రభావం
ప్రపంచ వ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% వాటా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారానే జరుగుతుంది. యుద్ధం వల్ల ఈ మార్గం మూతపడటంతో రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగాయి. భారత్ తన అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు మరో ప్రధాన కారణం.
Also Read: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ విజ్ఞప్తి – భయం వద్దు
పరిస్థితి ఇలా ఉండగా, చమురు సంస్థలు, ప్రభుత్వ వర్గాలు ప్రజలను ఆందోళన చెందవద్దని కోరుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించవద్దని, అవసరమైన మేరకే ఇంధనాన్ని నింపుకోవాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికావొద్దని, స్టాక్ తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
పెట్రోల్ బంకులపై యుద్ధం ఎఫెక్ట్
పెట్రోల్ ధరలు పెరుగుతాయని ప్రచారం
దీంతో పెట్రోల్ బంకులకు క్యూ కట్టిన జనం
Due to the ongoing propaganda that petrol prices will rise because of the war, people are lining up at petrol stations. pic.twitter.com/tbD0CbpnNo
— BIG TV Breaking News (@bigtvtelugu) March 24, 2026