Sharmila Slams BJP: విజయవాడలో గల ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడికి యత్నించారంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ పాల్పడిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ దాడిని బీజేపీ మూకల పిరికిపంద చర్యగా ఆమె అభివర్ణించారు. యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళలకు సమాధానం చెప్పే దమ్ములేక.. ఇలాంటి భౌతిక దాడులకు దిగుతున్నారంటూ మండిపడ్డారు. ఇది చాలా సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతి మాలిన చర్యలు అత్యంత హేయమైనవని షర్మిల అన్నారు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ శ్రేణులపై దాడులకు ఉసిగొల్పడం ఏమాత్రం బాగోలేదని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని, ఏదిచేసినా చెల్లుతుందని అనుకుంటే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కాంగ్రెస్ @INC_Andhra కార్యాలయంపై @BJP4Andhra @BJP4India బీజేపీ మూకల దాడి పిరికిపంద చర్య.
యువత భవిత కోసం కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత ఆందోళలకు సమాధానం చెప్పే దమ్ములేక, సహనం కోల్పోయి ఇలాంటి భౌతిక దాడులా ? సిగ్గు సిగ్గు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నీతి మాలిన చర్యలు అత్యంత… pic.twitter.com/Xt8unsBa5q
— YS Sharmila (@realyssharmila) July 22, 2026
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా.. పేపర్ లీకులపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేస్తూ దేశమంతా ఏకతాటిపై ఉద్యమం చేస్తుంటే.. ఆయన మాత్రం నీతి సూత్రాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేపర్ లీకులపై మోదీ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉందని ఎక్స్ లో రాసుకొచ్చారు. లీకుల వెనుక అసలు సూత్రధారి ప్రధాని మోదీనే అంటూ షర్మిల ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. కేవలం పాత్రదారి మాత్రమేనని షర్మిల అన్నారు.
Also Read: వానలో ఆఫీస్కి వెళ్తున్నారా? రూ.300 లోపున్న ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే.. రూ.వేలల్లో నష్టపోవాల్సిందే!
తీగ లాగితే ఎక్కడ డొంక కదులుతుందోనన్న భయం ప్రధాని మోదీది అని షర్మిల విమర్శించారు. లీకుల బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఉంటే.. ప్రధాని మోదీ తన చిత్తశుద్దిని చాటుకోవాలని షర్మిల సూచించారు. నైతిక బాధ్యత కింద వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంట్ లో నిర్మాణాత్మక చర్చకు ఆదేశాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
Also Read: 20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!