AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త కొత్త వ్యక్తుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సిట్ దర్యాప్తు ముమ్మరం అయ్యింది. మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు నర్రెడ్డి సునీల్రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు చేస్తోంది. సునీల్కి చెందిన 10 కంపెనీలకు ఐదు కార్యాలయాల్లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆయా కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్లో 4 కార్యాలయాలు, విశాఖపట్నంలోని రెండు కంపెనీల్లో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు సునీల్ రెడ్డి. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లోని స్నేహా హౌస్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో సాగర్ సొసైటీ, కాటేదాన్-రాజేందర్నగర్, ఖైరతాబాద్-కమలాపురి కాలనీ-ఫేజ్ వన్లో ఆఫీసుల్లో ఆయా సోదాలు జరుగుతున్నాయి.
దీనికితోడు విశాఖ సిటీలోని వాల్తేర్ రోడ్లో వెస్ట్ వింగ్, నగరం నడిబొడ్డున మరో కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆర్ ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ స్మార్ట్ ఇన్ఫ్రా కాన్, గ్రీన్ టెక్ ఇంజనీరింగ్ సిస్టమ్స్, శేఖర్ ఫౌండేషన్ వంటివి ఉన్నాయి.
అలాగే గ్రీన్ టెల్ ఎంటర్ ప్రైజెస్, గ్రీన్ కార్ట్ మీడియా, వయోలేటా ఫర్నిచర్స్, గ్రీన్ స్మార్ట్, జెన్సీస్ పెట్రో కెమికల్స్ అండ్ లాజిస్టిక్స్, గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రెడింగ్ కంపెనీలు సునీల్ రెడ్డి సొంతం. ఇంకా ప్రైవేట్ లిమిటెడ్, LLP, ఫౌండేషన్ హోదాల్లో సునీల్ రెడ్డి కార్యకలాపాలు కొనసాగున్నారు. సోదాల్లో సిట్ అధికారులు కీలక ఆధారాలు లభించినట్టు తెలుస్తోంది.
ALSO READ: ఫలించిన మంత్రి లోకేష్ కృషి.. నేపాల్ నుంచి ఏపీ వాసులు
ప్రస్తుతం సిట్ దాడులు చేస్తున్నవి సూట్ కేసు కంపెనీలుగా భావిస్తున్నారు. మద్యం ముడుపులు ఈ సెల్ కంపెనీల ద్వారా మళ్లినట్టు ఓ అంచనాకు వచ్చారు. అంతకుముందు హైదరాబాద్లో పలు కంపెనీల్లో సోదాలు చేసింది సిట్. ఆ సమయంలో పలు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. ఆ కార్యాలయాల్లో ఉండే హార్డ్ డిస్కులను తీసుకొచ్చి వాటిని డీ-కోడింగ్ చేయడంతో ఈ షెల్ కంపెనీల వ్యవహారం బయటకు వచ్చాయని తెలుస్తోంది. వీటి ద్వారా రానున్న రోజుల్లో ఇంకెవర్ని అరెస్టు చేస్తారో చూడాలి.