Srikakulam Robbery: ఇటీవలి కాలంలో దొంగతనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు రక్తాన్ని చెమటగా మార్చి.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొత్తును దొంగలు నిమిషాల్లో దోచుకెళ్తున్నారు.
ఇంటికి తాళాలు వేసినా, CCTV లు ఏర్పాటు చేసినా.. కిటికీల నుండో, తలుపులు పగులగొట్టో కేటుగాళ్లు ఎలా వస్తున్నారో, ఏ మార్గంలో మాయం అవుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగలు పది భారీ దోపిడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
శ్రీకాకుళం జిల్లాలోని బాలిగాం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డారు. అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో.. ఒకే వీధిలో వరుసగా ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేశారు. ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలను బద్దలు కొట్టి అందినకాడికి దోచుకెళ్లారు. బాధితులు ఉదయం లేచి చూసేసరికి ఇళ్లలోని సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండటం.. బీరువాలు తెరిచి ఉండటంతో షాక్కు గురయ్యారు.
ఈ దోపిడీలో దొంగలు భారీ మొత్తంలో నగదు, నగలను అపహరించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 15 తులాల బంగారం, 3 కిలోల వెండి వస్తువులను దుండగులు తీసుకెళ్లారు. వీటితో పాటు బీరువాల్లో ఉన్న కొంత నగదును కూడా దొంగిలించినట్లు సమాచారం. ఒకే రాత్రి ఐదు ఇళ్లలో దొంగతనం జరగడంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరించారు. గ్రామ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Also Read: భారత్- అమెరికా ట్రేడ్ డీల్.. కీ హైలైట్స్ ఇవే..!