India-US Trade Agreement: దేశ ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇటీవలే.. యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ సెట్ అయింది. ఇప్పుడు.. అగ్రరాజ్యం అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారతీయ ఉత్పత్తులపై మొన్నటివరకు ఉన్న ట్రంప్ టారిఫ్లు కూడా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయ్. ఈ డీల్స్తో.. మేడిన్ ఇండియా ప్రొడక్ట్స్ ఎగుమతులు ఎంత మేర పెరగనున్నాయ్? ఇండియన్ ఎకానమీకి ఈ ఒప్పందాలు బిగ్ బూస్ట్ ఇవ్వడం ఖాయమా?
వాణిజ్య ఒప్పందాల్లో భారత్ కీలక అడుగులు వేస్తోంది. కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య నలుగుతున్న సైలెంట్ ట్రేడ్ వార్ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు దేశాల నడుమ.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారతీయ ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరు దేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్వర్క్ను ఏర్పాటు చేసినట్లు.. భారత్-అమెరికా ఉమ్మడి ప్రకటనలో తెలిపాయ్. ఈ మధ్యంతర ఒప్పందాన్ని.. కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక విజయంగా చెబుతోంది. ఈ డీల్.. భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ తెరుస్తుందంటున్నారు.
ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఎగుమతులు పెరగడంతో.. దేశవ్యాప్తంగా మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. టెక్స్టైల్, లెదర్, ఫుట్వేర్, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రియ రసాయనాలు, చేతివృత్తుల ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్రాల లాంటి కీలక రంగాలకు భారీగా లాభం చేకూరనుంది. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. తమ దేశం నుంచి భారీగా ఇంధనం, గ్యాస్ను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఒప్పుకున్నట్లు ప్రకటించింది. తమ దేశం నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించినట్లు అమెరికా స్పష్టం చేసింది.
ఈ ఒప్పందంలో.. మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, నూనెగింజలు, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్, పొగాకుతో పాటు కొన్నిరకాల కూరగాయలు, మాంసం లాంటి వ్యవసాయ, పాల ఉత్పత్తులపై.. సుంకాల విషయంలో అమెరికాకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అన్ని వాణిజ్య చర్చల్లో రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. గతేడాది భారత వస్తువులపై ప్రెసిడెంట్ ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించారు. ఈ ఒప్పందంలో భాగంగా వాటిని తొలగించింది అమెరికా. అంతేకాదు.. రాబోయే పదేళ్లలో రక్షణ సహకారం విస్తరించుకునేందుకు.. రెండు దేశాలు ఓ ఫ్రేమ్వర్క్కు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఈ ట్రేడ్ డీల్తో.. ప్రెసిడెంట్ ట్రంప్ భారత్పై విధించిన భారీ సుంకాలను సగానికి పైగా తగ్గించడం, భారత ఎగుమతిదారులకు లభించిన అతిపెద్ద ఊరట. గతంలో 50 శాతం ఉన్న సుంకాలను.. ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. వియత్నాం, మలేషియా లాంటి దేశాల కంటే తక్కువ సుంకాలు భారత్కు ఉండటం వల్ల.. అమెరికా మార్కెట్లో మన వస్తువుల ధరలు తగ్గి, పోటీ పెరుగుతుంది. భారత్ కూడా అమెరికా నుంచి.. క్రూడ్ ఆయిల్, గ్యాస్, విమానాల స్పేర్ పార్ట్స్, ఏఐ టెక్నాలజీ లాంటి ఉత్పత్తులకు సంబంధించి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించుకోనుంది.
గత జనవరిలోనే.. భారత ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కూటమిగా ఉన్న యూరోపియన్ యూనియన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇండియన్ ఎకానమీకి వెన్నెముకగా నిలవనుంది. ఇది.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు.ఈ ఒప్పందం వల్ల 90 శాతానికి పైగా భారతీయ ఉత్పత్తులకు ఐరోపా మార్కెట్లో జీరో డ్యూటీ ఎంట్రీ లభిస్తుంది. ఇప్పటివరకు డ్యూటీ ఫ్రీ సౌకర్యంతో ఐరోపాకు టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్కు.. భారత్ ఇప్పుడు గట్టి పోటీ ఇవ్వనుంది. మన క్వాలిటీ, తక్కువ ధరల వల్ల.. ఐరోపా బ్రాండ్లు.. ఇండియా వైపు మళ్లే అవకాశాలున్నాయి. అంతేకాదు.. ఫార్మా, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులకు కూడా అధిక ప్రయోజనం కలగనుంది. భారతీయ పండ్లు, కూరగాయలు, టీ, కాఫీలకు ఐరోపాలో డిమాండ్ పెరిగి.. గ్రామీణ ఆదాయం పెరుగుతుంది. అమెరికా, ఐరోపాతో కుదిరిన ఈ వ్యూహాత్మక వాణిజ్య బంధం భారత్ని విశ్వగురువుగానే కాదు.. గ్లోబల్ ఎకనమిక్ పవర్హౌస్గా నిలబెట్టనుంది.
అమెరికా, యూరోపియన్ యూనియన్తో.. భారత్ కుదుర్చుకున్న భారీ వాణిజ్య ఒప్పందాలు.. దేశ ఎగుమతుల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయబోతున్నాయ్. ఈ డబుల్ ధమాకా డీల్స్.. భారతీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని శక్తిని అందించబోతోంది. ఈయూతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్ ఓ సంచలనం. దీనిని ఆర్థిక నిపుణులు.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందాల ప్రకారం.. యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యే దాదాపు 99.5 భారతీయ ఉత్పత్తులపై ఎలాంటి దిగుమతి సుంకాలు ఉండవు. గతంలో 10 నుంచి 20 శాతం ఉన్న టారిఫ్లు.. ఇప్పుడు సున్నాకి చేరడం వల్ల మన వస్తువుల ధరలు తగ్గి, పోటీతత్వం పెరుగుతుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నేరుగా యూరోపియన్ సప్లై చైన్లలో భాగస్వామ్యం పొందే అవకాశం దక్కింది. ఇది గ్రామీణ ఆదాయాన్ని, ఉపాధిని భారీగా పెంచనుంది.
అమెరికాతో కుదిరిన లేటెస్ట్ డీల్.. భారతీయ ఎగుమతిదారులకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యంగా.. ట్రంప్ హయాంలో పెరిగిన టారిఫ్లు ఇబ్బందిగా మారిన క్రమంలో.. ఈ ఒప్పందో వ్యూహాత్మక విజయంగా నిలిచింది. భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించే పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల.. అమెరికా మార్కెట్లో ఇతర దేశాల నుంచి ఎదురయ్యే పోటీని భారత్ సులభంగా అధిగమించనుంది. ఫార్మా ఉత్పత్తులు, వజ్రాలు, రత్నాలు, ఆటోమొబైల్ రంగం స్పేర్ పార్ట్స్ లాంటి ఎగుమతులకు.. ఈ ఒప్పందం ప్రాణం పోయనుంది. అమెరికా నుంచి వచ్చే ఆదాయంలో సగానికి పైగా ఐటీ రంగం నుంచే వస్తుంది. ఈ ఒప్పందం వల్ల వీసా నిబంధనల సరళీకరణ, డిజిటల్ ట్రేడ్లో స్థిరత్వం ఏర్పడి, ఐటీ కంపెనీల ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్ వార్షిక ఎగుమతులు 825 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఒప్పందాలతో.. మరో నాలుగేళ్లలో భారత్ ఎగుమతులు 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందనే అంచనాలున్నాయ్. అంతేకాదు.. వివిధ రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయ్. ఈ ఒప్పందాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కావు. భారత ఆర్థిక వ్యవస్థను.. 5 ట్రిలియన్ డాలర్ల నుంచి టెన్ ట్రిలియన్ డాలర్ల దిశగా నడిపించే ఇంధనాలుగా పనిచేయనున్నాయి. తక్కువ సుంకాల వల్ల.. ప్రపంచ దిగ్గజ కంపెనీలు.. ఇండియాని తమ ఎక్స్పోర్ట్ హబ్గా మార్చుకుంటాయ్. ఐరోపా, అమెరికా నుంచి టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్లు కూడా పెరుగుతాయ్. ముఖ్యంగా.. సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జ రంగాల్లో పెట్టుబడులు పెరగనున్నాయ్. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తున్న తరుణంలో, భారత్ ఇలాంటి భారీ ఒప్పందాలను దక్కించుకోవడం గ్రేట్ ఫీట్ అనే చెప్పాలి. ఈ రెండు ఒప్పందాల వల్ల భారతీయ ఉత్పత్తులు నాణ్యతతో పాటు ధరలోనూ ప్రపంచ దేశాలకు గట్టి పోటీని ఇవ్వనున్నాయ్.
భారత్ ఇప్పుడు కేవలం ఓ మార్కెట్గా మాత్రమే కాదు, ప్రపంచానికి వస్తువులను సరఫరా చేసే అతిపెద్ద కర్మాగారంగా మారుతోంది. ఈ చరిత్రాత్మక ఒప్పందాల అమలుతో.. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని భారత్ అనుకున్న సమయం కంటే ముందే చేరుకునే అవకాశాలున్నాయ్. చైనాకు ఆల్టర్నేట్గా ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, భారత ఆర్థిక వ్యవస్థ మరో మెట్టు ఎక్కడమే కాదు.. ఏకంగా అగ్రరాజ్యాల సరసన చేరడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
Story by: Anup, Big Tv