Gunda Appala Suryanarayana: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ(78) కన్నుమూశారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శనివారం ఆయన ఇంట్లో కాలు జారి పడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని శనివారం వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. సూర్యనారాయణ భౌతికకాయాన్ని అరసవల్లిలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. సూర్యనారాయణ మృతిపై టీడీపీ నేతలు సంతాపం తెలిపారు.
గుండ అప్పల సూర్యనారాయణ శ్రీకాకుళంలో 1948 జనవరి 16న జన్మించారు. 1981లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి కౌన్సిలర్గా రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. అనంతరం టీడీపీలో చేరి వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 నుంచి 2004 వరకు ఆయన శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో ఎన్టీ రామారావు ప్రభుత్వంలో సూర్యనారాయణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి గుండ లక్ష్మీదేవి 2014-19 మధ్య శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
“మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన వరుసగా నాలుగు సార్లు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు రెండుసార్లు మంత్రిగా పని చేశారు. క్రమశిక్షణతో పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన చేసిన సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను”- సీఎం చంద్రబాబు
“రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి వారు లేని లోటు తీరనిది. ముక్కుసూటి, నిజాయితీకి మారుపేరైన గుండ అప్పల సూర్యనారాయణ నేటితరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. వారి సేవలు చిరస్మరణీయం. గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను”- మంత్రి నారా లోకేశ్