Srisailam Karthika Masam: ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం.. దక్షిణ భారతదేశంలోనే ప్రముఖమైన శైవక్షేత్రాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం కార్తీక మాసం ప్రారంభమైన వెంటనే ఈ పవిత్ర క్షేత్రంలో ఉత్సవాల ప్రారంభం అవుతాయి. ఈసారి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది.
భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు, దీపోత్సవాలు వైభవంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలిలోనే కాదు, దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు శ్రీశైలాన్ని సందర్శించనున్నారు.
ముఖ్యమైన తేదీలు & ప్రత్యేక ఉత్సవాలు
అక్టోబర్ 24 – కార్తీక మాసపు తొలి శుక్రవారం. ఈ రోజున శ్రీ కృష్ణమ్మకు నదిహారతి ఘనంగా నిర్వహించనున్నారు.
నవంబర్ 1 – గంగాధర మండపంలో అద్భుతంగా కోటిదీపోత్సవం. వేలాది దీపాలతో క్షేత్రం ప్రకాశిస్తుంది.
నవంబర్ 5 – పవిత్రమైన జ్వాల తోరణం. భక్తులు దీపాలను వెలిగించి స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటారు.
ప్రతి సోమవారం – లక్ష దీపోత్సవం, అలాగే పుష్కరిణి హారతి కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
సామూహిక అభిషేకాలపై పరిమితులు
భక్తుల రద్దీ అధికమవుతుందని అంచనా వేసి, శనివారం, ఆదివారం, సోమవారం, పౌర్ణమి రోజులలో సామూహిక అభిషేకాలను నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయించింది. సాధారణ రోజుల్లో మాత్రం పరిమితంగా అనుమతిస్తారు. దీని వల్ల భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.
భక్తుల రద్దీకి ప్రత్యేక ఏర్పాట్లు
ప్రతి ఏడాది కార్తీక మాసోత్సవాల సమయంలో.. శ్రీశైలం పట్టణం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఈసారి కూడా అక్టోబర్ నెల నుంచి భారీ రద్దీ ఉండబోతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టనుంది.
రవాణా సౌకర్యాలు పెంపు
తాత్కాలిక వసతి గృహాలు
త్రాగునీరు, ఆహార సదుపాయాలు
మెడికల్ సెంటర్లు, అత్యవసర సేవలు
ఇలా భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
ఆధ్యాత్మిక ప్రాధాన్యత
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన నెలగా పరిగణించబడుతుంది. దీపదానం, హరినామస్మరణ, వ్రతాలు, హారతులు చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని విశ్వాసం. శ్రీశైలంలో స్వయంగా స్వామివారి సన్నిధిలో దీపోత్సవాలు చేయడం అనన్యమైన అనుభూతిని కలిగిస్తుంది.
భక్తులు కుటుంబాలతో, బంధువులతో కలిసి పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని ఆధ్యాత్మికతను అనుభవిస్తారు.
Also Read: దొరికిపోయిన భూమన.. అలిపిరి ఆరోపణపై టీటీడీ రియాక్షన్ ఇదే!
అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు జరిగే కార్తీక మాసోత్సవాలు ఈసారి కూడా లక్షలాది భక్తులను ఆకర్షించనున్నాయి. ప్రత్యేక పూజలు, దీపోత్సవాలు, హారతులు క్షేత్రాన్ని భక్తి క్షేత్రముగా మార్చనున్నాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా దేవస్థానం, ప్రభుత్వం కలసి ఏర్పాట్లు చేస్తుండటం విశేషం.
ఈ కార్తీక మాసంలో శ్రీశైలంలో జరిగే ప్రతి ఉత్సవం భక్తులకు మరపురాని అనుభూతిని కలిగించబోతోంది.