Taneti Vanitha: వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తోందని మాజీ మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ప్లెక్సీలపై సినిమా డైలాగులు రాస్తే కేసులు పెట్టడం, నల్లజర్లలో కార్యకర్తను నడిరోడ్డుపై నడిపించడం వంటి చర్యలు దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
రక్త తర్పణం చేసిన వారిని ఊరి నుంచి బహిష్కరించాలని హోంమంత్రి అనిత అంటున్నారని, మరి బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజున థియేటర్ల వద్ద 20 పొట్టేళ్ల తలలు నరికి దండలు కట్టినప్పుడు హోంమంత్రికి అది జీవహింసలా, రాక్షస సంస్కృతిలా కనిపించలేదా అని వనిత సూటిగా ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టిందే టీడీపీ అని, ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు టీడీపీ కార్యకర్తలు రక్తంతో తర్పణం చేసినప్పుడు హోంమంత్రి కళ్లు మూసుకున్నారా అని నిలదీశారు.
మా వాళ్లకు పోలీసులతో ‘ట్రీట్మెంట్’ ఇప్పిస్తానంటూ హోంమంత్రి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించే అధికారం, చట్టాన్ని చేతిలోకి తీసుకునే అర్హత పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. జగన్ను దూషిస్తేనే మంత్రి పదవి ఉంటుందని అనిత భావిస్తున్నారని, రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆమెకు పట్టడం లేదని విమర్శించారు.
రాజధాని రైతులు మోసపోయామని గ్రహించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి నేతలు ‘జీవహింస’ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వనిత ఆరోపించారు. ప్రభుత్వం ఎంత వేధించినా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, జరుగుతున్న దాడులన్నింటినీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేయాలని సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.