TDP Petition on Janasena Symbol: ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రతీ దశలోనూ కూటమి అభ్యర్థులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై న్యాయస్థానానికి వెళ్లింది తెలుగుదేశం పార్టీ.
జనసేన పార్టీ గుర్తుపై ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కూటమి అభ్యర్థులను మరింత గందరగోళం లోకి నెట్టిందని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్నాయని, గాజు గ్లాసు గుర్తును మిగతా నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థులకు కేటాయించరాదని పిటీషన్ వేసింది తెలుగుదేశం పార్టీ.
ముఖ్యంగా జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాసు సింబల్ను అన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లలో ఇతరులెవరికీ కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని అత్యవసరంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేనకు రిజర్వు చేయాలన్నది అందులోని ప్రధాన పాయింట్. స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించకుండా ఈసీని ఆదేశించాలని కోరారు. ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు ఓటర్లను మరింత అయోమయానికి గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.
Also Read: అడ్డంగా దొరికిన టెక్కలి వైసీపీ అభ్యర్థి, దువ్వాడా.. మజాకా?
జనసేన పార్టీ పోటీ చేసే రెండు ఎంపీ స్థానాలతోపాటు 21 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇతర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు తెలిపింది. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలగుతాయని పేర్కొంది. మిగతా నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తే కూటమి అభ్యర్థులపై ప్రభావం చూపుతుందన్నది టీడీపీ వాదన. మరి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడిస్తుందో చూడాలి.