Amaravati News: 2029 ఎన్నికలకు టీడీపీ ఇప్పటి నుంచే రెడీ అవుతోందా? ఎప్పుడూ లేని విధంగా పార్టీలో పదవుల పంపకానికి రంగం సిద్ధమైందా? ఒకటీ లేదా రెండు రోజుల్లో హైకమాండ్ నుంచి ప్రకటన రావడం ఖాయమా? త్రీమెన్ కమిటీ రిపోర్టు, సర్వే ఆధారంగా పార్టీలో నేతలకు పదవులు అప్పగించేందుకు రెడీ అయ్యిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
టీడీపీలో జిల్లా అధ్యక్షుల నియామకానికి అంతా రెడీ
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయ్యింది. ఇంకా మూడేళ్లన్నరేళ్లు సమయం ఉంది. ఇప్పటినుంచే పార్టీని గాడిలో పెట్టేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు. జిల్లాల అధ్యక్షుల ఎంపిక దాదాపు పూర్తి అయినట్టు సమాచారం. రేపో మాపో జాబితాను పార్టీ హైకమాండ్ ప్రకటించనుంది.
2024 ఎన్నికల్లో ఎలాంటి ఈక్వేషన్స్ ద్వారా పార్టీ విజయం సాధించిందో ఆ ఫార్ములా జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఉపయోగించినట్టు తెలుస్తోంది. జిల్లా కమిటీకి గతంలో 30 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు 45 మంది సభ్యులు ఉంటారని టాక్. ఈసారి జిల్లాల అధ్యక్షుడి ఎంపికలో సోషల్ ఇంజనీరింగ్కు అధిక ప్రయార్టీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల మాట.
ఈ వారంలో ప్రకటన వచ్చే అవకాశం
గతవారం టీడీపీ ఆఫీసుకు సీఎం చంద్రబాబు వచ్చారు. ఆ సమయంలో జిల్లా అధ్యక్షుల ఎంపిక ఎంతవరకు వచ్చింది, అనే వివరాలు నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆలస్యం కావడంపై ఆరా తీశారట అధినేత. ట్రీ మెన్ కమిటీ రిపోర్టు, సర్వేలను పరిశీలించి జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేసినట్టు సమాచారం.
2024 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేశారు. అనుకున్నట్లుగా విజయం సాధించింది. కేబినెట్ కూర్పులోనూ అదే ఫార్ములాను వినియోగించారట. అదే ఫార్ములాను జిల్లా అధ్యక్షుల నియామకంలో అమలు చేయనున్నారట. జనాభా ప్రాతిపదికన, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఐదు అంశాల ఆధారంగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు టాక్.
35 శాతం పదవులు అగ్రవర్ణాలకు, 40 శాతం బీసీలకు, 8 శాతం ఎస్సీలకు, 4 ఎస్టీలకు, ఇతర పదవులు మైనార్టీ , మిగతా వర్గాలకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారట అధినేత. అయితే మహిళలకు 35 శాతం పదవులు కేటాయించాలని భావిస్తున్నారట. వివిధ జిల్లాల్లో రాజకీయ పరిస్థితులను బట్టి కనీసం 25 శాతానికి తగ్గకుండా కేటాయించాలన్నది అధినేత ఆలోచనగా కొందరు నేతల మాట.
ALSO READ: భోగాపురం ఎయిర్పోర్టు వచ్చేనెలలో, టార్గెట్ ఫిక్స్ అయ్యిందన్న మంత్రి లోకేష్
జిల్లా అధ్యక్షుడితోపాటు ఐదుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులు ఉంటారట. అంతేకాదు కమిటీ సభ్యులుగా పార్టీ కార్యకర్తలను నియమించనున్నట్లు సమాచారం. అందులో యువకులు, సామాన్య కార్యకర్తలకు ఛాన్స్ దక్కనుందని తెలుస్తోంది.
జిల్లా అధ్యక్ష పదవులు ఎక్కువగా ఎమ్మెల్యే టికెట్లు రానివారు, నామినేటెడ్ పదవులు దక్కనివారికి కేటాయించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నుంచి కొన్ని లీకులు వస్తుండడంతో అధ్యక్షుడి రేసులో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు కొందరు నేతలు ఆరా తీస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జిల్లాల నేతలను టీడీపీ హైకమాండ్ సిద్ధం చేస్తోందన్నమాట.