Jasprit Bumrah: సౌత్ ఆఫ్రికాతో ఐదు టి – 20 ల సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన మూడవ టి-20 లో టీమిండియా విశ్వరూపం చూపించింది. సఫారీలను చిత్తుచిత్తుగా ఓడించి భారీ విజయాన్ని నమోదు చేసింది. డిసెంబర్ 14న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.
Also Read: BBL-Shaheen Afridi: షాహీన్ అఫ్రిదికి ఘోర అవమానం.. ఓవర్ మధ్యలోనే బౌలింగ్ తొలగించిన అంపైర్
ఈ మ్యాచ్ లో మొదట బౌలర్లు చెలరేగి సఫారీలను తక్కువ స్కోరుకే అవుట్ చేయగా.. ఈజీ చేజింగ్ లో ఓపెనర్లు అభిషేక్ శర్మ వేగంగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. ఇక చేజింగ్ లో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి గెలుపొందింది.
ఈ మూడవ టి-20కి టీమ్ ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా {Jasprit Bumrah} వ్యక్తిగత కారణాల వల్ల జట్టును వీడాడు. మ్యాచ్ కి ముందే ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇక తదుపరి టి-20 ల్లో కూడా బుమ్రా జట్టులో చేరే విషయంపై త్వరలోనే అప్డేట్ ఇస్తామని పేర్కొంది. ఇదే విషయాన్ని టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా చెప్పుకొచ్చాడు. అస్వస్థతతో అక్షర్ పటేల్ జట్టుకు దూరం కాగా.. వ్యక్తిగత కారణాలవల్ల బుమ్రా ఇంటికి వెళ్లిపోయాడని తెలిపాడు. బుమ్రాకి అత్యంత సన్నిహిత వ్యక్తి ఆసుపత్రిలో చేరడంతో వెంటనే ముంబైకి వెళ్లాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది. అయితే పరిస్థితి మెరుగుపడితే 4 లేదా 5వ టి-20కి బుమ్రా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉందని బిసిసిఐ అధికారి తెలిపారు. ఇక మూడవ టి-20కి బుమ్రా అందుబాటులో లేకపోవడంతో.. అతడి స్థానంలో హర్షిత్ రానా ఆడాడు. నాలుగు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చిన హర్షిత్.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండవ టి-20 లో పూర్తిగా తేలిపోయిన అర్షదీప్ సింగ్.. మూడవ టి-20లో 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
నాలుగవ టి-20 మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో, చివరి టి-20 డిసెంబర్ 19 అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. మొదటి టీ-20 లో ఓడి.. రెండవ మ్యాచ్ లో గెలిచిన సౌత్ ఆఫ్రికా.. మూడవ టి-20 లోనూ పరాజయం పాలైంది. ఇక కీలకమైన నాలుగవ టి-20 లో ఎలాగైనా విజయం సాధించాలని సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. మార్క్రమ్ ఫేవరెట్ మైదానమైన లక్నోలో నాలుగవ టి-20 జరగనుండడంతో.. ఈ మ్యాచ్ లో గెలుపొంది సిరీస్ పై పట్టు సాధించాలని చూస్తోంది సౌత్ ఆఫ్రికా.
ఈ సిరీస్ లోని తొలి టీ-20 లోనే బుమ్రా తన టీ-20 కెరీర్ లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. కేవలం 81 టి-20 అంతర్జాతీయ మ్యాచ్లలోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. బూమ్రా ఇప్పటికే టెస్టుల్లో 234 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలో హండ్రెడ్ ప్లస్ వికెట్లు తీసిన బౌలర్ల జాబితా ప్రపంచ క్రికెట్ లో చాలా చిన్నదిగా ఉంది. ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో భారత క్రికెట్ తరఫున బుమ్రా పేరు కూడా చేరింది.