Weather Updates: ఎండ వేడిమితో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలను పలకరిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరుణుడు కరుణించాడు. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. తీవ్రమైన ఎండల నుండి ఈ అకాల వర్షాలు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని అందించాయి.
తెలంగాణను ముంచెత్తిన అర్ధరాత్రి వానలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్, కంది, సదాశివపేట మండలాల్లో, నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో, అలాగే కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పరిధిలో వాన దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం ఉదయం 8:30 గంటల వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్లో హఠాత్ వర్షం.. ప్రయాణికులకు తిప్పలు
రాజధాని హైదరాబాద్లో సైతం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, హయత్నగర్, ఎల్బీనగర్ వంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా చల్లటి గాలులు వీచి, వాన పడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ హఠాత్ పరిణామం ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులను, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను కాస్త ఇబ్బంది పెట్టింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్ష సూచన..
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో పాటు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనివల్ల నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉన్నందున, రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించుకుని బయటకు వెళ్లాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: భాగ్యనగరంలో బోనాల సంబురం.. గోల్కొండ కోటలో తొలి బోనంతో షురూ అయిన జాతర