Tirumala: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి ఆలయ ఉత్తర ద్వార దర్శనం కోసం సీఎం రేవంత్ తిరుమలకు విచ్చేశారు. సోమవారం రాత్రి గాయత్రి అతిథి గృహం వద్ద సీఎంరేవంత్ రెడ్డికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం అతిథి గృహంలోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పుష్పగుచ్ఛం, స్వామివారి చిత్ర పటాన్ని అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోనున్నారు.
అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఏపీ వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఇతర అధికారులు సీఎం స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు పరిశీలించారు. ముందుగా గోగర్భం డ్యామ్ సర్కిల్ వద్దకు చేరుకున్న ఛైర్మన్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు, సదుపాయాలపై పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలాతోరణం, కృష్ణతేజ విశ్రాంతి గృహాల వద్ద ఏర్పాటు చేసిన SSD టోకెన్ల తనిఖీ కేంద్రంలో తనిఖీ ప్రక్రియను పరిశీలించి భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులందరికీ సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. పోలీసులు, విజిలెన్స్, టీటీడీ యంత్రాంగం సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు.
సోమవారం తెల్లవారుజామున 12:05 గంటలకు వైకుంఠ ద్వారములు తెరవనున్నారు. జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. తిరుమలకు 80 మందికి పైగా ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు రానున్నారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు, న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు 10 రోజుల పాటు రద్దు చేశారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులు టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
జనవరి 2 నుండి జనవరి 8 వరకు టోకెన్లు, సర్వ దర్శన క్యూలైన్ లో ఉన్న భక్తులకు అనుమతి ఉంటుంది. తెల్లవారుజామున 1:30 నుంచి ప్రోటోకాల్-కేటగిరీ ప్రముఖులకు వైకుంఠ దర్శనం కల్పిస్తారు. మంగళవారం తెల్లవారుజామున 5:00 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు.