Cold Wave: తెలంగాణ గడ్డ మీద ఇప్పుడు చలి మామూలుగా లేదు, అసలు “చలి పులి” పంజా విసురుతున్నట్టే ఉంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే దాకా ఒళ్లు గడ్డకట్టుకుపోయేలా చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో అయితే చలి చంపేస్తోంది. ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ లాంటి చోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పడిపోవడంతో జనం బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. మధ్యాహ్నం దాకా కూడా సూర్యుడు ముఖం చాటేస్తుండటంతో, జనం ఇళ్లలోనే ముడుచుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక వాతావరణ శాఖ (IMD) వాళ్లు అయితే ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, సంగారెడ్డి, ములుగు, మంచిర్యాల, వరంగల్, హనుమకొండతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. అంటే రానున్న రోజుల్లో ఈ చలిగాలులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ చలికి భయపడి జనం ఉదయం ఏ పని చేసుకోలేక ఆగమాగం అవుతున్నారు.
పొగమంచు ముచ్చట అయితే ఇంకో తీరుగా ఉంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్ల మీద పక్కనున్న మనిషి కూడా కనిపిస్తలేడు. ఉదయం తొమ్మిది దాటినా సరే, వెలుతురు రాక డ్రైవింగ్ చేసేవాళ్లు, ముఖ్యంగా బైకుల మీద వెళ్లేవాళ్లు నానా అవస్థలు పడుతున్నారు. ఈ పొగమంచు వల్ల రైతులు పొలాలకి వెళ్లలేక, పనులు సాగక ఇబ్బంది పడుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి లాంటి జిల్లాల్లో అయితే పొగమంచు వల్ల వాహనాలు దారి తప్పే పరిస్థితి కనిపిస్తోంది.
అలాగే అటు పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా చలి పరేషాన్ చేస్తోంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన అరకు లోయ, చింతపల్లిలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోయాయి. ముంచంగిపుట్టు, దుబ్రిగూడ లాంటి ఏరియాల్లో చలి తీవ్రతకు గడ్డి మీద మంచు బిందువులు గడ్డకట్టి తెల్లటి పొరలా కనిపిస్తున్నాయి. మన్యం జిల్లాలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అక్కడ కూడా వాతావరణం పొడిగా ఉండి, చలిగాలులు విపరీతంగా వీస్తుండటంతో గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: తీవ్ర విషాదం.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
అయితే ఈ చలికాలంలో ముసలివాళ్లు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం బయటకు రాకపోవడమే మంచిది. వెచ్చని దుస్తులు, స్వెట్టర్లు, గొంగడి లాంటివి కప్పుకోవాలి. వేడి వేడి ఆహారం తింటూ, వేడి పానీయాలు తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అనవసరంగా బయట తిరిగి జబ్బులు తెచ్చుకోకుండా, ఎండ వచ్చినప్పుడే కాస్త రిలీఫ్ కోసం బయట కూర్చోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.