Tiger Tension: సిద్దిపేట జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత మూడు రోజులుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి జాడ ఉన్నట్లు అనుమానాలు బలపడటంతో.. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలతో అడవులను జల్లెడ పడుతూ విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
సిద్దిపేట జిల్లా తొగుట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు పాదముద్రల ఆధారంగా.. ప్రాథమిక నిర్ధారణకు అధికారులు వచ్చారు. తొగుట మండలంలోని గోవర్ధనగిరి, కొండాపూర్, గుడికందుల, వర్ధరాజ్పల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించడంతో స్థానికుల్లో భయం నెలకొంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పులి జాడను ఖచ్చితంగా నిర్ధారించేందుకు అటవీ శాఖ 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. మొత్తం 45 మంది ఫారెస్ట్ సిబ్బంది 24 గంటల పాటు అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. పులి సంచారానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ భద్రతా చర్యలు చేపట్టారు.
పులి కదలికలను స్పష్టంగా గుర్తించేందుకు తొగుట అటవీ ప్రాంతంలో.. 15 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా పులి కదలికలు, దారి, సమయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో దట్టమైన అటవీ ప్రాంతాలు, లోయలు, నీటి గుంటలు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు పులి ప్రత్యక్షంగా కనిపించకపోయినా, పాదముద్రలు, పశువులపై దాడి ఆనవాళ్లు అధికారులను మరింత అప్రమత్తం చేశాయి.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు మహారాష్ట్రలోని.. తడోబా టైగర్ రిజర్వ్ నుంచి ఇద్దరు నిపుణులను సిద్దిపేట జిల్లాకు రప్పిస్తున్నారు.
అటవీశాఖ డీఎఫ్ఓ పద్మజారాణి ఈ సందర్భంగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Also Read: హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీసు కమిషనరేట్లు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్
మొత్తంగా సిద్దిపేట జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అటవీ శాఖ అప్రమత్త చర్యలతో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలని, భయాందోళనలకు గురికాకుండా అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నారు.