Tadepalligudem News: పోయిన ప్రాణం మళ్లీ తిరిగి వచ్చింది అంటుంటారు కదా.. సేమ్ టు సేమ్ అలాగే జరిగిందిక్కడ. అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయాడని ఇద్దరు వ్యక్తులు స్మశాన వాటికకు తీసుకువచ్చారు. అక్కడే గల కాటికాపరికి అప్పగించారు. కాటికాపరి ఖననం చేసేందుకు అన్నీ సిద్ధం చేశాడు. ఆ శిశువును చితిపై ఉంచాడు. కర్రకు అగ్గి రాజేశాడు. ఇక అంతే.. కాటికాపరి ఖంగు తిన్నాడు. అసలేం జరిగిందంటే…
అప్పుడప్పుడు చనిపోయిన మనుషులు మళ్లీ వచ్చారనే వార్తలు వింటూ ఉంటాం. వాటిలో ఎంత వాస్తవం ఉంటుందో ఏమో కానీ ఈ ఘటన మాత్రం వాస్తవమే. కొద్ది క్షణాల్లో చితి మంటల్లో కాలిపోవాల్సిన చిన్నారి, గట్టిగా క్యావ్.. క్యావ్ అంటూ కేకలు వేశాడు. వెంటనే ఆ కాటికాపరి అరెరే.. ఒక్క క్షణంలో అంతా అయిపోయేదిగా అంటూ భయాందోళన చెంది, ఆ పసి బాలుడిని ఎత్తుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగింది.
తాడేపల్లిగూడెం లోని స్మశానం వద్దకు అప్పుడే పుట్టిన మగ శిశువును తీసుకొని బిడ్డ చనిపోయాడు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు చేరుకున్నారు. అక్కడే గల కాటి కాపరికి పసిబిడ్డను అప్పగించి ఖననం చేయాలని కోరారు. పసిబిడ్డను ఖననం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన కాటి కాపరి, కర్రకు అగ్గి రాజేసే క్రమంలో బిడ్డ అరుపులను విన్నాడు. పసిబిడ్డ ఏడుపు విని షాక్ కు గురైన కాటి కాపరి, వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులకు సమాచారం ఇచ్చిన కాటికాపరి, బ్రతికి ఉన్న బిడ్డను ఎందుకు తీసుకువచ్చారంటూ వారితో గొడవకు దిగాడు. అంతలోనే పోలీసులు రాగా, గుర్తుతెలియని వ్యక్తులు పరారయ్యారు. చిట్టి చివరకు వారిని గుర్తించి బిడ్డను స్వాధీనం చేసుకున్న పోలీసులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం ప్రభుత్వ వైద్యశాలలో బిడ్డకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also Read: TTD News: ఆ ఛానెళ్లపై కేసు నమోదు.. లైసెన్స్ లను రద్దు చేయాలని టీటీడీ ఫిర్యాదు
ఈ ఘటనపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం పోలీసులు తెలిపారు. బ్రతికి ఉన్నప్పుడే పసిబిడ్డను ఖననం చేసే సమయంలో ఆ పసిబిడ్డ అరుపులే, అతని ప్రాణాలు కాపాడాయని కాటికాపరి తెలిపారు. వాస్తవంగా బిడ్డ చనిపోయాడని స్మశానానికి తీసుకు వచ్చారా.. లేక మరి ఇతర కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.