![AP Weather](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/03/aap-2-1.jpg)
Andhra Pradesh Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుగా ఉష్ణోగ్రత భారీగా పెరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టేందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించినా ఒంటిపూట బడులకు పంపాలన్నా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు ఆఫీసు పనులు, ఇతర పనులపై బయటకు వెళ్లే వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.
మార్చి నెల మొదలు కాకముందు నుండే ఎండలు మండిపోతున్నాయి. అయితే మార్చి నెలలో నయోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ముందు నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మార్చి నెలలో మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి. ఇప్పుడు ఇలా ఏప్రిల్ చివరి నాటికి పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయో అని ప్రజలతో పాటు వాతావరణ శాఖ అధికారులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీచేసింది. ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండలపై ఏపీ ప్రజలను అప్రమత్తం చేసింది.
Also Read: రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను తరిమికొట్టడం జగన్ బ్రాండ్.. చంద్రబాబు
ప్రస్తుతం ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లోను ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎండలతో పాటు, భారీ వేడి గాలులతో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. శుక్ర, శని వారాల్లో ఏపీ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు విపత్తుల నిర్వాహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. శుక్రవారం 42 మండలాల్లో, ఇక శనివారం 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు.
శుక్రవారం రోజున 42 మండలాల్లో వడగాల్పులు వీస్తాయన్న ఆయన.. వైఎస్సార్ కడప 18, పార్వతీపురం మన్యం 8, నంద్యాల 8, గుంటూరు 1, ఎన్టీఆర్ 6, పల్నాడులో 1, వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, ముసలివారు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకూడదని హెచ్చరించారు. బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం ప్రయాణాలు మానుకుంటే మంచిదని తెలిపారు.