AP Fire Crackers: బాణసంచా తయారీ, నిల్వ పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. వీటిని నివారించేందుకు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది.
బాణసంచా తయారీ, నిర్వహణ, నిల్వ ప్రక్రియలలో భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది. అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించేందుకు నిర్ధేశించిన ప్రామాణిక విధానాలను కచ్చితంగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేలుడు పదార్థాల నియమాలు-2008 అనుగుణంగా, లైసెన్స్ పొందిన తయారీదారులు భద్రతా చర్యలను పాటించాలన్నారు.
బాణసంచా తయారీ భవనాలు బేస్మెంట్లు లేకుండా ఒకే అంతస్తు నిర్మాణాలుగా ఉండాలన్నారు. బాణసంచా తయారీ షెడ్లు ఒకదానికొకటి, జనావాస ప్రాంతాల నుండి కనీసం 45 మీటర్ల సురక్షిత దూరంలో ఉండాలన్నారు. కర్మాగారాల్లో ధూళి, దుమ్ము లేకుండా తగిన జాగ్రత్తలతో గృహ నిర్వాహక పద్ధతులను పాటించాలన్నారు. ఫ్యాక్టరీ లోపల ఎటువంటి ఫైర్ సంబంధిత కార్యకలాపాలు.. మంటలు, ధూమపానం, అగ్గిపెట్టెలు, లైటర్లు, మొబైల్ ఫోన్లు నిషేధించినట్లు చెప్పారు.
బాణసంచా తయారీ కార్యకలాపాలు ఉదయం 7:30 నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే నిర్వహించుకోవాలి. రసాయన మిక్సింగ్ వంటి ప్రమాదకర ప్రక్రియలను మానవ తప్పిదాలను తగ్గించడానికి ఆటోమేటిక్ గా చేయాలి. పేలుడు పదార్థాలను నిర్వహించడానికి స్పార్కింగ్ కాని (non-sparking) సాధనాలను మాత్రమే ఉపయోగించాలి. ప్రతి కార్మికుడు వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించాలి.
Also Read: AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని, మద్యం సేవించిన వారిని బాణసంచా ఫ్యాక్టరీలోకి అనుమతించకూడదు. ఉద్యోగులకు భద్రతా విధానాలు, అత్యవసర ప్రతిస్పందనలపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. కార్మికులకు జీవిత బీమా, వైద్య బీమా పాలసీని చేయాలి. ఫ్యాక్టరీలలో ఆటోమేటిక్ అగ్ని గుర్తింపు వ్యవస్థలు, తగిన అగ్నిమాపక యంత్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. లైసెన్స్ పొందిన తయారీదారులు అందరూ మార్గదర్శకాలను పాటించాలి. తద్వారా సురక్షితమైన పని వాతావరణాన్ని ఏర్పరచి, ప్రజా భద్రతకు భరోసా ఇవ్వాలి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ జనరల్ పీవీ రమణ తెలియజేశారు.