Tirumala Ghee Case Updates: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏం జరగనుంది? ముగ్గురు వ్యక్తులు అప్రూవర్గా మారారా? డైయిరీ నిపుణుడు, ఓ సైంటిస్టు కూడా ఉన్నారా? రేపో మాపో కొందరు నేతలు, అధికారులు అరెస్టు కావడం ఖాయమా? సిట్ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగిందా? రెండువారాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అప్రూవర్గా డైయిరీ నిపుణుడు
ఏపీలో రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ విషయంలో అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఫలితంగా వైసీపీ నేత అంబటి రాంబాబు అరెస్టు చేశారు. తాజాగా తిరుమల లడ్డూ కేసు గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి కేసులో ముగ్గురు వ్యక్తులు అప్రూవర్లగా మారారు.
నిందితుల్లో డెయిరీ ఎక్స్పర్ట్ డాక్టర్ సురేంద్రనాథ్ ఉన్నారు. ఆ ముగ్గురు తాము చేసిన నేరాన్ని కోర్టులో అంగీకరించారు. తిరుమలలో దర్శనాలు, వసతి ఏర్పాట్లలో ప్రొటోకాల్ మర్యాదలు చేశారు ఆనాటి ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు. వారి మర్యాదలకు ఫిదా అయిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో సహకరించినట్టు స్వయంగా న్యాయస్థానం ఎదుట అంగీకరించారు.
న్యాయస్థానం ముందు నేరాన్ని అంగీకరించిన నిందితులు
అప్రూవర్గా మారిన డెయిరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బత్తల సురేంద్రనాథ్. ఆయన డిసెంబరు మొదటి వారంలో న్యాయస్థానం ముందు హాజరై మొత్తమంతా పూసగుచ్చినట్టు వివరించారు. నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చెందిన కెమిస్ట్రీ విభాగం సైంటిస్ట్ డాక్టర్ సురేంద్రనాథ్. టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీలో నెయ్యి నిపుణుడిగా పని చేసిన ఆయన, సామర్థ్యం లేకున్నా డెయిరీలకు అనుకూల నివేదికలు ఇచ్చారు.
భోలేబాబా డెయిరీ ఉద్యోగి ఆశిష్ రోహిలా కూడా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆశిష్ రోహిలా ఉత్తరాఖండ్లోని భోలేబాబా డెయిరీ ఉద్యోగి. అతడు పని చేసిన కాలంలో కల్తీ నెయ్యి దందా జరిగింది. ఏయే రసాయనాలు ఎంతెంత పరిమాణంలో వచ్చాయి, వాటితో కల్తీ ఎలా చేశారు వంటివి కోర్టుకు తెలియజేశాడు.
ALSO READ: విశాఖలో బాంబు కలకలం.. చెత్తకుప్పలో లైట్లు వెలుతురు చూసి హంగామా, చివరికి..
మూడో వ్యక్తి మహేశ్ కుమార్ రోహిరా రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి. నగదు లావాదేవీల వివరాలను బయటపెట్టి కోర్టు ముందు ఒప్పుకొన్నాడు. కల్తీ నెయ్యి విధానం గురించి మొత్తం కోర్టుకు వెల్లడించారు. ఈ కేసు చార్జిషీట్లో మొత్తం 36 మంది నిందితులుగా ఉన్నారు. అందులో ముగ్గురు అప్రూవర్లుగా మారారు. నిందితుల్లో డెయిరీ సంస్థలకు చెందినవారు ఐదుగురు ఉన్నారు. 31 మంది నిందితులు ఉన్నారు.
అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది సిట్. మరోసారి ఈ వ్యవహారంపై ఓ కమిటీ వేసింది ప్రభుత్వం. దీనిపై వారం లేదా రెండు వారాల్లో ఆ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దాని ఆధారంగా చర్యలు చేపట్టనుంది. అధికారులతోపాటు కొందరు నేతలపై చర్యలు తీసుకోవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.