Nigeria: ఉగ్రవాదం మరోసారి పడగ విప్పింది. క్వారా రాష్ట్రంలోని వోరో, నూకు అనే రెండు గ్రామాలపై ఇస్లామిక్ స్టేట్ (IS) అనుబంధ ఉగ్రమూకలు మెరుపుదాడికి పాల్పడ్డాయి. ఏ మాత్రం కనికరం లేకుండా జరిపిన ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 162 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. గ్రామాల్లోని వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం నైజీరియా దేశం తీవ్రమైన భద్రతా, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ (ISWAP) వంటి సంస్థలు నిరంతరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా వేల సంఖ్యలో ప్రజలు ఈ హింసకు బలికాగా, లక్షలాది మంది తమ నివాసాలను వదిలి శరణార్థులుగా మారుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఉగ్రవాదులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి పౌరులపై దాడులను అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.
ఈ తాజా దాడితో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వోరో, నూకు గ్రామాల్లోని నివాసితులు ప్రాణ భయంతో అడవుల్లోకి పరుగులు తీశారు. ఉగ్రవాదులు కేవలం కాల్పులకే పరిమితం కాకుండా, ఇళ్లను తగులబెట్టడం, నిత్యావసరాలను దోచుకోవడం వంటి చర్యలకు పాల్పడినట్లు సమాచారం. దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆస్ట్రేలియాలో దారుణం.. తెగబడిన దుండగులు, గాంధీ విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా?
ఈ దారుణ ఘటనపై క్వారా రాష్ట్ర గవర్నర్ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ బలగాలు ఉగ్రవాద నిర్మూలన కోసం తీసుకుంటున్న కఠిన చర్యల వల్ల భయపడిపోయిన మూకలు, ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ దాడి వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి.