Tirumala Rush: వరుసగా సెలవులు రావడంతో.. తిరుమల కొండ భక్తులకు కిటకిటలాడుతోంది. తిరుమలలో నెలకొన్న అనూహ్య రద్దీ కారణంగా డిసెంబర్ 27, 28, 29వ తేదీలకు సంబంధించిన శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీని టీటీడీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ లో, తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు జారీ నిలిపివేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శన ప్రణాళికలను రూపొందించికోవాలని ఈ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండిపోయి.. క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది. క్యూలైన్లలోని భక్తులకు తాగునీరు, పాలు, టీ, అన్నప్రసాదాలను అందిస్తున్నారు. క్యూలైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లన్నీ నిండిపోవడంతో.. భక్తులు వసతి సముదాయంలో ఉంటూ శుక్రవారం ఉదయం సర్వదర్శనం క్యూలైన్లోకి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. బుధవారం శ్రీవారిని 73,524 మంది భక్తులు దర్శించుకోగా.. రూ.4.88 కోట్లు హుండీ కానుకలు లభించాయి.
వారాంతపు సెలవుల నేపథ్యంలో అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలోకి భారీగా చేరుకున్నారు. మొదట SSD టోకెన్స్ జారీ పూర్తి కావడంతో భక్తులు ఒక్కసారిగా దివ్య దర్శన టోకెన్లకు ఎగబడ్డారు. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీస్, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై క్యూ లైన్ లలో పరిస్థితిని అదుపు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
టికెట్ల కోటా పూర్తయిందని టీటీడీ సిబ్బంది ప్రకటించడంతో.. భక్తులు తిరుమలకు పయనమయ్యారు. మరో వైపు తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలిరావటంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాల రద్దీ పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో వాహనాల తనిఖీకి సమయం పడుతుంది. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరాయి.