Tirumala: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంభట్ల గ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగకు ముందే ఇక్కడ నిర్వహించే జల్లికట్టు (పశువుల పండగ) వేడుకలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.
ఈ ఏడాది జల్లికట్టు పోటీల కోసం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా సుమారు 200 కోడె గిత్తలు, 20 ఆవుల గుంపులు మైదానానికి చేరుకున్నాయి. రంకెలేస్తూ, ఉరకలు వేస్తూ మైదానంలోకి దూసుకువస్తున్న పోట్లగిత్తలను చూసి ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నారు. ఈ గిత్తలను నిలువరించేందుకు, వాటి కొమ్ములకు కట్టిన బహుమతులను దక్కించుకునేందుకు యువకులు తమ ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగుతున్నారు.
ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గిత్తలను పట్టుకునే క్రమంలో బలంగా ఢీకొట్టడంతో ఒక యువకుడి చెయ్యి విరిగింది. మరో వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. మరికొంతమంది యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గిత్తలు ఒక్కసారిగా జనాల పైకి దూసుకురావడంతో అక్కడ కొంతసేపు తొక్కిసలాట వంటి వాతావరణం నెలకొంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నా.. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు జనం వెనకాడటం లేదు. వేలాదిగా తరలివచ్చే ప్రజల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజన, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కొత్త శానంభట్లలో జరుగుతున్న ఈ జల్లికట్టు వేడుకలు అటు సాహసానికి, ఇటు భక్తికి ప్రతీకగా నిలుస్తున్నాయి. పౌరుషానికి నిదర్శనంగా నిలిచే ఈ క్రీడలో పాల్గొనేందుకు యువత పోటీ పడుతుండటం గమనార్హం.
ALSO READ:Tirumala News: తిరుమల ఘాట్ రోడ్లో.. అజ్ఞాత వ్యక్తి హల్చల్.. నేనే దేవుడిని అంటూ..?
https://Tiwtter.com/bigtvtelugu/status/2007043210926080166?s=20